ఆయన కాలం కంటే ముందుంటారు: వాజపేయిపై నరేంద్ర మోడీ భావోద్వేగం, వద్దన్నా సీఎం చేశారు!
Recommended Video
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ విజపేయి మరణం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంత బాగా ఉండేదో అందరికీ తెలిసిన విషయమే.
తనకు తండ్రిలాంటి వ్యక్తి దూరమయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదనకు గురయ్యారు. 'మేరే అటల్ జీ.. మీరు ఈ దేశానికి దిక్సూచి. ఆదర్శవంతుడికి నిలువెత్తు నిదర్శనం. మాటలకందని మంచితనం' అంటూ వాజపేయికి మోడీ తన బ్లాగులో ఉద్వేగభరిత వ్యాఖ్యలతో నివాళులర్పించారు.
ఎప్పటికీ పూడ్చలేనిదంటూ మోడీ భావోద్వేగం
‘ఎ లీడర్ ఫర్ ది ఏజెస్, హి వాజ్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్' పేరుతో రాసుకొచ్చిన ఈ బ్లాగులో వాజపేయివ్యక్తిత్వం, గొప్పతనాన్ని మోడీ కీర్తించారు. అటల్ బిహారీ వాజపేయి మరణం తనకు వ్యక్తిగతంగా ఎప్పటికీ పూడ్చలేని లోటు అని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోడీ. ఆయన బ్లాగులో వాజపేయి గురించి ఉద్వేగపూరితమైన సుదీర్ఘ వ్యాసం రాశారు.
కదిలించే స్ఫూర్తి ప్రధాత
‘విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఓ గొప్ప నాయకుడు వచ్చారు. ప్రజలను మార్గనిర్దేశనం చేశారు. ముందుకు నడిపించారు. ఆయనే అటల్ బిహారీ వాజపేయి. కలిసిన ప్రతి ఒక్కరిని కదిలించే, స్ఫూర్తినిచ్చే అరుదైన వ్యక్తి ఆయన. అమితమైన కరుణామయుడు. ధీశాలి. ప్రతి ఒక్కరు గర్వించదగ్గ వ్యక్తి. అంతకు మించిన హాస్యచతురత కలిగిన వారు. అద్భుతమైన వక్త' అంటూ మోడీ కొనియాడారు.
చిన్నతనం నుంచే ప్రజాసేవలో..
‘మధ్యప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. చిన్న వయసు నుంచే ప్రజాసేవకు అంకితమయ్యారు. జనసంఘ్లో చిన్న కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పార్లమెంట్లో నాలుగు దశాబ్దాలు నాయకుడిగా ఉన్న ఆయన.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించారు. నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారు' అంటూ వాజపేయిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు మోడీ.
సవాళ్లకు ఎదురొడ్డి నిలిచారు
‘ప్రపంచ వేదికలపై భారత్ను సరికొత్తగా పరిచయం చేశారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశాన్ని ప్రగతి దిశగా నడిపించారు. ఎన్నో విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. దేశ భద్రత, సమగ్రత కోసం పాటుపడ్డారు. కీలక ముందడుగులు వేశారు. ఎన్నో విషయాల్లో ఆయన మనకు స్ఫూర్తిదాయకం. వ్యక్తిగతంగా ఆయన నాకు గురువు, ఆదర్శప్రాయుడు' మోడీ ఉద్వేగభరితంగా తన వ్యాసాన్ని కొనసాగించారు.
సీఎం అవ్వాలన్నారు.. నవభారతాన్ని నిర్మిస్తాం
‘2001 అక్టోబరులో ఓ రోజు సాయంత్రం ఆయన నన్ను పిలిచి గుజరాత్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టమన్నారు. అప్పుడు నేను సంస్థ (ఆర్ఎస్ఎస్) కోసమే పనిచేస్తానని చెప్పాను. అయితే ఆయన మాత్రం.. ప్రజల కలల్ని సాకారం చేయగల సత్తా నీకుంది అని చెప్పారు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ, ఎప్పటికీ ఆయన ఈ దేశానికి నిజమైన భారత రత్నం. ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గనిర్దేశనం చేస్తాయి. ఆయన కలలుగన్న నవభారతాన్ని మేం నిర్మిస్తాం' అంటూ మోడీ ఉద్వేగంతో తన వ్యాసాన్ని ముగించారు.