కరోనా టీకా రెండో డోసుకే ప్రాధాన్యత ఇవ్వండి: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండో డోసు తీసుకునేవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత ఇతరులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.
Recommended Video
మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవాల్సిన సమయం తక్కువగా ఉన్నందున వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే రెండు డోసులు వేసుకున్న ప్రజల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా కట్టడికి మరో ముందడుగు పడుతుందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
70:30 నిష్పత్తిలో రెండో, తొలి డోసులను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని ఆరోగ్యశాఖ వెల్లించింది. రాష్ట్రాలు వ్యాక్సిన్ డ్రైవ్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. దేశంలో ఇప్పటి వరకు అన్ని కేటగిరీలను కలిపి 16.50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది.
హెల్త్ కేర్ వర్కర్లలో 0.95 కోట్ల మందికి తొలి డోసు, 0.64 కోట్ల మంది రెండో డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఫ్రంట్లైన్ వర్కర్లలో 1.38 కోట్ల మందికి తొలి డోసు, 0.75 కోట్ల మందికి రెండో డోసు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రటరీ తెలిపారు.
దేశంలో 45ఏళ్లకు పైబడిన 10.76 కోట్ల మందికి ఇప్పటి వరకు తొలి డోసు వేసినట్లు పేర్కొన్నారు. 1.90 కోట్ల మందికి రెండో డోసు కూడా వేసినట్లు వెల్లడించారు. 18-44 వయస్కుల్లో ఇప్పటికే 11.81 కోట్ల మందికి తొలి డోసు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 16.50 శాతం డోసులు వేసినట్లు తెలిపారు.