అరుదైన రికార్డ్ సాధించిన నిమ్స్ హాస్పిటల్!
హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హాస్పిటల్ మరో అపూర్వ ఘనత సాధించింది. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికంగా 2,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించిన మొదటి ఆసుపత్రిగా నిమ్స్ రికార్డు సృష్టించింది. 1989లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేపట్టిన నిమ్స్, తాజాగా 2,000వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేసినట్టు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప శుక్రవారం ప్రకటించారు.
2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు
ఈ విజయం వెనుక యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగాల డాక్టర్లు, సిబ్బంది చేసిన అవిరామ కృషి కీలకమని ఆయన తెలిపారు.గత 35 ఏళ్లలో నిమ్స్లో చేసిన 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో దాదాపు 95 శాతం మంది రోగులు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. వీరంతా ఆరోగ్యశ్రీ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పూర్తిగా ఉచితంగా చికిత్స పొందారు.

మందులు కూడా ఉచితంగా ఇస్తున్న నిమ్స్
శస్త్రచికిత్స తర్వాత అవసరమయ్యే జీవితాంతం మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీంతో ఎంతో మంది రోగులు కొత్త జీవితాన్ని పొందారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహలు నిమ్స్కు అందిస్తున్న పూర్తి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్ లోనే
యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ రాహుల్ రాజ్ నాయకత్వంలోని బృందం క్లిష్టమైన బహుళ రక్తనాళాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, పిల్లల్లో మార్పిడి శస్త్రచికిత్సలు, రీ-ట్రాన్స్ప్లాంట్లు వంటి సవాలుతో కూడిన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిందని అన్నారు.నిమ్స్లోనే దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా నిర్వహించబడింది. ఇది నిమ్స్ యొక్క అత్యాధునిక వైద్య సామర్థ్యానికి నిదర్శనం.
నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఈ ఘనతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రపంచ స్థాయి వైద్యం అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని నిమ్స్ మరోసారి నిరూపించిందన్నారు. గాంధీ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్, సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్లో కొత్త ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అవయవ మార్పిడి కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.













Click it and Unblock the Notifications