వచ్చే 3 ఏళ్లలో యూనిట్కు రూపాయి తగ్గింపు, 20 లక్షల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్లో నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమానాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విప్లవాత్మకమైన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ' (ICE) పాలసీని తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సరికొత్త పాలసీలో భాగంగానే 'SAEL' సంస్థ జమ్మలమడుగు ప్రాంతంలో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసిందని, కేవలం 11 నెలల రికార్డు కాలంలోనే ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావడం విశేషమని ఆయన కొనియాడారు. ఈ ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందని మంత్రి వివరించారు.
500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం!
యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. భారతదేశంలోనే తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఆయన గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో రాబోయే రోజుల్లో ఏకంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనే భారీ లక్ష్యంతో తాము శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప జిల్లాలో విద్యుత్ రంగానికి సంబంధించి సుమారు 85 శాతం ఆర్డీఎస్ఎస్ (RDSS) పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు.

జగన్ పాలనలో విద్యుత్ దోపిడీ..
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పీపీఏల రద్దు పేరుతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులను జగన్ బెదిరించి తరిమికొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా, గత ఐదేళ్ల పాలనలో ఏకంగా 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేసినట్లు చెప్పారు.
రెండేళ్లలో చార్జీలు పెంచలేదు.. ట్రూ డౌన్ చేశాం!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలపై ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీల భారం వేయలేదని మంత్రి గొట్టిపాటి గర్వంగా ప్రకటించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో అదనపు వసూళ్ల కోసం 'ట్రూ అప్' చార్జీలు అమలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తాము 13 పైసలు 'ట్రూ డౌన్' (ధరల తగ్గింపు) చేసి వినియోగదారులకు ఊరటనిచ్చామని తెలిపారు. అంతేకాదు, రాబోయే మూడేళ్ల కాలంలో విద్యుత్ చార్జీలను యూనిట్కు రూపాయి చొప్పున తగ్గించడమే తమ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అదనంగా మరో 960 మెగావాట్ల జలవిద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందన్నారు.
'సూర్యఘర్' ద్వారా ఉచిత సోలార్ వెలుగులు
సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా 'సూర్యఘర్' పథకం ద్వారా సోలార్ కనెక్టివిటీని విస్తరిస్తున్నట్లు మంత్రి రవి కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఈ పథకం కింద సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే తరహాలో త్వరలోనే బీసీ వినియోగదారుల కోసం మరో 9 లక్షల సూర్యఘర్ సోలార్ కనెక్షన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా, నలుమూలలా సమానాభివృద్ధి చేసే దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉద్ఘాటించారు.














Click it and Unblock the Notifications