ట్రాఫిక్ రాల్స్ ఉల్లంఘిస్తే వాతలే: నేటి నుంచే భారీ జరిమానాలు అమలు ఇలా, కానీ..
న్యూఢిల్లీ: నేటి(సెప్టెంబర్ 1) నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం 2019కి ఆగస్టులో ఆమోదం పొందడంతో దేశ వ్యాప్తంగా ఈ భారీ జరిమానాలు అమలు కానున్నాయి. పౌరులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జరిమానాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటిక పోలీసులు సూచనలు చేస్తున్నారు.

ప్రజల భద్రత కోసమే..
ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టేందుకు కొత్త సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ భారీ జరిమానాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇంతకుముందున్న జరిమానాల కంటే ఇప్పుడు అమలయ్యేవి భారీగా ఉండటంతో వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ జరిమానాల భయంతోనైనా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లైసెన్స్ లేకుండా నడిపితే..
కొత్త చట్టం ప్రకారం.. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇంతకుముందు ఇది రూ. 500లే ఉండటం గమనార్హం. అర్హత లేకున్నా వాహనం నడిపితే విధించే జరిమానాను రూ.500 నుంచి రూ. 5000 వరకు పెంచడం జరిగింది.

ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వకుంటే..
అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ. 10వేల వరకు జరిమానా విధించనున్నారు. టాక్సీ అగ్రిగేటర్స్ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది.

వేగం మితిమీరితే..
సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు రూ. 1000 జరిమానా విధించనున్నారు. ఇంతకుముందు ఇది రూ.100గా ఉంది. వాహనాలు పరిమితికి మించి వేగంగా నడిపితే రూ. 1000-2000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు రూ. 400గా ఉండేది. లైట్ మోటార్ వెహికిల్కు రూ. 1000, మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ. 2000గా ఉంది.

మద్యం తాగి నడిపితే..
ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2000, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000 జరిమానాతోపాటు మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసే అవకాశం ఉంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపితే రూ. 10వేలు జరిమానా విధించడం జరుగుతుంది. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు.

మైనర్లకు వాహనాలిస్తే..
మైనర్లు వాహనాలు నడిపితే ఆ వాహన యజమాని లేదా సంరక్షకుడికి రూ. 25వేల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష. అంతేగాక, వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు.
పరిమితికి మించి బరువు(ఓవర్లోడ్)తో వెళ్లే వాహనాలకు రూ. 20వేల జరిమానా.
డ్రైవర్ల లైసెన్స్లు కంప్యూటరైజ్ చేయబడతాయని, ఆన్ లైన్ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

అప్పటి వరకు రూ.100
పలు రాష్ట్రాల్లో హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే ప్రస్తుతం రూ. 100 మాత్రమే ఫైన్ విధిస్తున్నారు. ఆ మొత్తాన్ని కేంద్రం రూ.1000కి పెంచింది. అయితే, రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు వెలువడేంత వరకు ప్రస్తుతం ఉన్న రూ. 100 జరిమానానే వసూలు చేస్తారు. కాగా, ట్రాఫిన్ నిబంధనల అతిక్రమణ కేసులు మాత్రం యథాతథంగా నమోదవుతాయి.












Click it and Unblock the Notifications