భారీ వర్షాలు: 10 మంది మృతి, జయలలిత ఆదేశాలు
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా 10 మంది మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు పొంగుతున్నాయి. కడలూరు కట్టారు నదిలో పదిమంది కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జయలలిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కడలూరు సమీపంలోని కాట్టారు నదిలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో... వరదలో కొట్టుకుపోయి పదిమంది మృతి చెందారు. కడలూరు వద్ద సముద్రంలో 150 పడవలు కొట్టుకుపోయాయి.
తూర్పు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీవ్రంగా మారడంతో వానలు ఎడతెరపిలేకుండా కురుస్తున్నాయి. చెన్నై, పుదుచ్ఛరితో పాటు ఏపీలోని నెల్లూరు, కడప జిల్లాలో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరం అంతటా గత 24 గంటల్లో అధిక వర్షపాతం నమోదైంది.
చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కడప జిల్లాలోని రైల్వే కోడూరు, ఓబుళవారి పల్లి, చిట్వేల్, రాజంపేట, పెనగలూరు, నందలూరు, రాయచోటి ప్రాంతాల్లో జోరుగా వర్షపాతం నమోదవుతోంది.