భారత్-పాక్ జంటకు సుష్మా సాయం, బంగ్లాలో గుడుల దాడిపై కన్నెర్ర
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరో భారత్ - పాక్ జంటకు సాయం చేశారు. సామాజిక అనుసంధాన వేదికలో ఎవరైనా సాయం కోరితే సుష్మ వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా దుబాయ్లో నివసిస్తున్న భారతీయుడు సాయం కోరగా, ఆమె స్పందించారు.
దుబాయ్లో నివసిస్తున్న యాసిన్ భారతీయుడు. అతడి భార్య పాకిస్థానీ. వారి కుమారుడి చికిత్స కోసం భార్యను ముంబై పంపించాలని యాసిన్ అనుకున్నాడు. ఆమెకు భారత వీసా కోసం దరఖాస్తు చేశారు. కొడుకుకి వైద్యం చేయించాలని, తన భార్యకు త్వరగా వీసా మంజూరయ్యేలా చూడాలని కోరుతూ సుష్మాకు అతను ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు.
తాను భారతీయ పౌరుడినని, ప్రత్యేక అవసరాలు కలిగిన తన కుమారుడికి ముంబైలో వైద్యం చేయించేందుకు తన భార్య అత్యవసరంగా భారత్ రావాల్సి ఉందన్నారు.
త్వరగా వీసాకు అనుమతించాలని సామాజిక మీడియా ద్వారా అభ్యర్థించారు. యాసిన్ ట్వీట్కు స్పందించిన సుష్మా.. వీసా కోసం చేసిన దరఖాస్తు వివరాలు సహా ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించాలనుకుంటున్నారో చెప్పాలని అడిగారు.
బంగ్లాలో దేవాలయాలపై దాడులు, సుష్మ ఆగ్రహం
బంగ్లాదేశ్లో మరోసారి హిందూ దేవాలయాల పైన దాడులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు కొందరు ఇక్కడి బ్రహ్మన్ బర్హియా జిల్లాలోని నాసిర్నగర్లో రెండు ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులకు చెందిన కనీసం ఆరు ఇళ్లకు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఇది జరిగింది. ఈ ఘటనపై సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు.
ఢాకాలో ఉన్న భారత హైకమిషనర్తో ఆమె మాట్లాడారు. ఆమె ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడాలని సూచించారు. భారత ప్రభుత్వ ఆందోళన తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియాలో ఓ వర్గానికి వ్యతిరేకంగా ఎవరో పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో వారం రోజులుగా హిందువుల ఇళ్లు, ఆలయాలపై అల్లరి మూకలు దాడులు చేస్తున్నాయి. వందలాది మంది హిందువులను గాయపరిచారు.
కాగా, హిందూ దేవాలయాలు, హిందువులపై దాడుల నేపథ్యంలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. హిందువులపై దాడులకు తెగబడుతున్నవారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఢాకాలో ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా పరిస్థితిని గమనించిన భారత్.. బంగ్లాకు గట్టి సందేశాన్ని పంపింది. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.