ఖైదీలు భాగస్వాములతో సెక్స్ చేయవచ్చు: కోర్టు సంచలనం
చండీఘర్: ఖైదీల శృంగారం విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. వివాహం చేసుకున్న ఖైదీలను తమ భాగస్వాములతో సెక్స్ చేయడానికి అనుమతించాలని ఆదేశించింది. పిల్లలను కూడా కనవచ్చునని చెప్పింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. తమ భాగస్వామి సందర్శన ద్వారా లేదా కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనే ప్రాథమిక హక్కు ఉందని చెప్పింది.
పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్న జస్వీర్ సింగ్, సోనియా దంపతులు పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ఆ ఆదేశాలు జారీ చేశారు. హోషియార్పూర్కు చెందిన సంపన్న కుటుంబంలోని 16 బాలుడిని భారీ సొమ్ము కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఆ దంపతులకు ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఒక చోటు ఉండి, శృంగారంలో పాల్గొని బిడ్డను కనే అవకాశం ఇవ్వాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో తమకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. తమ తల్లిదండ్రులకు తాను ఒక్కడినే కుమారుడినని, తమకు వివాహం జరిగిన ఎనిమిది నెలల లోపల తమ అరెస్టు జరిగిందని, తమ డిమాండ్ వ్యక్తిగత కామవాంఛను తీర్చుకోవడానికి కాదని జస్వీర్ తన పిటిషన్లో అన్నాడు.
కిరాతకమైన హత్య కేసులో దోషి కావడం వల్ల జస్వీర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అయితే, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును కోర్టు విశాలదృష్టితో పరిశీలించింది. జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దోషులు, ఖైదీలకు దంపతుల సందర్శన ద్వారా లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలను కనే హక్కును కూడా ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. గే హక్కులపై లేదా మూడో జెండర్ గుర్తింపుపై సమాజం అకడమిక్ స్థాయిలో, బౌద్ధిక స్థాయిలో చర్చలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఖైదీల దాంపత్య సందర్శల విషయంలో జడప్రాయమైన ఆలోచనల దుప్పటి కింద దాచి ఉంచడం గానీ దానికి సిగ్గుపడడం గానీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే, హక్కులను చట్టం ద్వారా నియంత్రించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. అది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. దాని కోసం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జైలు సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జైలులో కుటుంబ సభ్యుల, దంపతుల కలయికకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను ఆ కమిటీ సూచించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఆ విధమైన సందర్శనలకు సంబంధించి ఖైదీలను వర్గీకరించాలని ఆయన అన్నారు. కమిటీ తగిన సిఫార్సులు చేయడానికి ప్రధాన జైళ్లను సందర్సించి, ఏడాదిలోగా సూచనలను చేయాలని చెప్పింది. కమిటీలో సామాజిక శాస్త్రవేత్తలు, నిపుణులు, జైలు అధికారులు ఉండాలని చెప్పింది.