ఎన్కౌంటర్: రీపోస్టుమార్టం ఖర్చు ఏపీదే, భద్రత కల్పించాలని తమిళనాడుకు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన శశికుమార్కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించింది. పోస్టుమార్టం ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని సూచించింది.
రీపోస్టుమార్టం ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మరోసారి శవపరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నిమ్స్ వైద్యులు చెన్నై వెళ్లేందుకు అదనపు భద్రత కల్పించాలన్నారు. శవపరీక్షను అడ్డుకొని ర్యాలీలు, ఊరేగింపులు చేయకుండా చూడాలని అదేశించింది. నివేదికను సీల్డు కవరులో తమకు అందజేయాలని సూచించింది.
వికారుద్దీన్ ఎన్కౌంటర్ పైన..
వికారుద్దీన్ ముఠా ఎదురు కాల్పుల కేసు పైన హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆలేరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఒక్కొక్కరికి 15 తూటాలు తగిలాయని పేర్కొంది. మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని అర్జీదారు అభ్యర్థించారు. కేసు విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది.