పళనిస్వామికి షాక్: బలనిరూపణ చెల్లదంటున్న మాజీ స్పీకర్స్!..
పళనిస్వామి బలపరీక్ష చెల్లదని, దాన్ని రద్దు చేసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని ముత్తయ్య డిమాండ్ చేశారు.
చెన్నై: గత కొద్దిరోజులుగా నిత్యం సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతూ వస్తోన్న తమిళ రాజకీయాల్లో పళనిస్వామి సీఎం అయిన తర్వాత ఇక అనిశ్చితికి తెరపడినట్లేనని అంతా భావించారు.
అటుపై బలపరీక్షతో మరోసారి అనిశ్చితి రేగే పరిస్థితి కనిపించినా.. అన్నాడీఎంకె ఎమ్మెల్యేలంతా పళనిస్వామి వైపే నిలవడంతో ఇక అన్నాడీఎంకె రాజకీయాలు స్థిరంగా సాగుతాయన్న భావన కనిపించింది. కానీ ఇంతలోనే పరిస్థితి మళ్లీ అడ్డం తిరిగే అవకాశముందని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

తాజాగా తమిళనాడు మాజీ స్పీకర్స్ సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్ పళనిస్వామి బలపరీక్షపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ తరువాత అత్యధిక ఎమ్మెల్యేలున్న డీఎంకే, రహస్య ఓటింగ్ జరపాలన్న డిమాండ్ ను తెరపైకి తేగా, దాన్ని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని వారు విమర్శించారు.
స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరించారని, సభలోని పరిణామాలు నిబంధనలకు విరుద్దమని అభిప్రాయపడ్డారు. గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో.. అసెంబ్లీలోను అలాగే ఉన్నారని, అంతమాత్రానికి రిసార్టులోనే బలపరీక్ష పూర్తి చేయాల్సిందని ముత్తయ్య ఎద్దేవా చేశారు.
పళనిస్వామి బలపరీక్ష చెల్లదని, దాన్ని రద్దు చేసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని ముత్తయ్య డిమాండ్ చేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పక్షానికి వెన్నుదన్నుగా స్పీకర్ నిలవడం ప్రజాస్వామ్యానికేమాయని మచ్చ అని అభిప్రాయపడ్డారు.
మరో మాజీ డిప్యూటీ స్పీకర్ వీపీ దురైస్వామి సైతం స్పీకర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ సభలో లేనప్పుడు మార్షల్స్ సభ లోపలికి ఎలా వెళ్లగలిగారని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ చేపట్టిన బలపరీక్షను కోర్టులో సవాల్ చేస్తే.. రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications