కరోనా.. అన్ కంట్రోల్: 6 లక్షలను దాటిన మరణాలు: బ్రేకుల్లేకుండా: భారత్లో ఒక్కరోజే 39 వేలకు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భూగోళాన్ని కమ్మేసింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత బలపడుతోందే తప్ప.. దాని ప్రభావం ఎక్కడే గానీ తగ్గట్లేదు. కనీసం బలహీనపడుతున్న సూచనలు కూడా లేవు. గంటగంటకూ వేలాది మందిని బలి తీసుకుంటోందా వైరస్. భారత్ సహా ప్రపంచ దేశాలను కబళించేలా కనిపిస్తోంది. వ్యాక్సిన్ తప్ప మరెలాంటి ముందుజాగ్రత్త చర్యలకూ ఈ మహమ్మారి లొంగేలా కనిపించట్లేదు.
Recommended Video
ఆరు లక్షలను దాటిన
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు ఆరు లక్షలను దాటేశాయి. కరోనా మరణాల సంఖ్య మరింత వేగాన్ని పుంజుకుంటోంది. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య అక్షరాలా ఆరు లక్షలను దాటేసింది. 6, 04, 963 మంది వైరస్కు బలి అయ్యారు. ఇందులో అత్యధిక వాటా అమెరికాదే. ఒక్క అమెరికాలో కరోనా మరణాలు 1,42,877కు చేరుకున్నాయి.
న్యూయార్క్, న్యూజెర్సీ..
అత్యధిక మరణాలు న్యూయార్క్, దాని జంటనగరం న్యూజెర్సీల్లో నమోదు అయ్యాయి. న్యూయార్క్లో 32,552 మంది, న్యూజెర్సీలో 15,776 మంది మరణించారు. అమెరికా తరువాత బ్రెజిల్ ఆ స్థాయిలో ప్రాణ నష్టాన్ని చవి చూసింది. బ్రెజిల్లో ఇప్పటిదాకా 78,817 మంది చనిపోయారు. అక్కడ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ను దాటింది. బ్రెజిల్లో 20,75,246 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. డిశ్చార్జి అయిన వారి సంఖ్యతో పోల్చుకుంటే.. యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్నాయి.
భారత్లో భయానకంగా..
భారత్లో రోజురోజుకూ కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను సడలించిన తరువాత.. రోజువారీగా నమోదవుతోన్న కేసులు రికార్డులను బదల్లు కొడుతున్నాయి. రోజురోజుకూ వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో 38, 902కు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో చేయి జారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
మరణాల సంఖ్యలో అనూహ్య పెరుగుదల..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 300 సంఖ్యను దాటని కరోనా వైరస్ మరణాలు..కొద్దిరోజులుగా 500లకు తగ్గట్లేదు. శనివారం నాడు కూడా 543 కరోనా మరణాలు దేశంలో నమోదు అయ్యాయి. ఫలితంగా ఇప్పటిదాకా మృత్యువాత పడిన వారి సంఖ్య 26,816కు చేరుకుంది. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి దేశాల జాబితాలో టాప్టెన్లో కొనసాగుతోంది భారత్.
ఆ దేశాల తరువాత భారత్..
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరణాల్లోనూ టాప్టెన్లోకి చేరుకుంది. భారత్ కంటే ముందు అమెరికా-1,42,877, బ్రెజిల్-78,817, బ్రిటన్- 45,273, మెక్సికో-38,888, ఇటలీ-35,042, ఫ్రాన్స్-30,152, స్పెయిన్-28,420 ఉన్నాయి. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, మెక్సికోల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో వేగం మందగించింది. కొత్త కేసులు నమోదు కావట్లేదు. మరణాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయి.