Hijab Row:ఉడిపిలో పక్కా ప్లాన్..తెరవెనక పనిచేసిందెవరు- వీడియో (అసలేం జరిగింది..?)
ఉడిపిలో హింసకు దారితీసిన హిజబ్ వ్యవహారంలో ప్రముఖ జాతీయ ఆన్లైన్ మీడియా ది న్యూస్ మినిట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవే అంశాలను న్యూస్ మినిట్ తన ఆన్లైన్ పోర్టల్లో ప్రచురించింది. ఉడిపి ఎంజీఎం కాలేజీలో హిజబ్ వ్యవహారంపై రభస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాలేజీ విద్యార్థులను హిందూ జాగరణ్ వేదిక సంస్థ రెచ్చగొట్టిందంటూ ఇదే విషయం తమ ఇన్వెస్టిగేషన్లో బయటపడిందని న్యూస్ మినిట్ పేర్కొంది. హిజబ్లు ధరించి వస్తున్న తమ క్లాస్మేట్స్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పేర్కొంటూ... హిందూ మతానికి చెందిన విద్యార్థులకు కాషాయ శాలువలు మరియు తలపాగాలు పంచిపట్టినట్లు న్యూస్ మినిట్ కథనం ప్రచురించింది.
ఫిబ్రవరి 8వ తేదీన ఉడిపిలోని ఎంజీఎం కాలేజీలో దాదాపు 100 విద్యార్థులు కాషాయ శాలువాలు, తలపాగాలతో కనిపించి నిరసనలు చేపట్టిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మరో వైపు ముస్లిం మతానికి చెందిన అమ్మాయిలు సైతం ఒక బృందంగా ఏర్పడి వారితో వాగ్వాదం చేస్తున్న వీడియోలు బయటకువచ్చాయి. అయితే హిజబ్ వ్యవహారం మొదట ప్రారంభమైన కాలేజీ మాత్రం ఎంజీఎం కాలేజీ కాదు. మహిళా ప్రభుత్వ పీయూ కాలేజీలో హిజబ్ ధరించిన విద్యార్థిణులపట్ల ఏం జరిగిందో చూశాకా ఎంజీఎం కాలేజీలోని ముస్లిం విద్యార్థులు నిరసన తెలిపారంటూ ఓ స్టూడెంట్ న్యూస్మినిట్తో మాట్లాడుతూ తెలిపింది. ఇదిలా ఉంటే తమ విచారణలో భాగంగా న్యూస్ మినిట్ కొన్ని ఆధారాలను సేకరించింది. ఎంజీఎం కాలేజీలో ఘటన జరుగుతుందనగా... అంతకు రెండురోజుల ముందు ఓ సందేశం సర్క్యులేట్ అయినట్లు న్యూస్ మినిట్ తెలిపింది. కన్నడలో ఉన్న ఆ మెసేజ్ సారాంశం ఇలా ఉంది
#Watch: MGM college students in #Udupi, #Karnataka return the orange turbans allegedly distributed by the Hindu Jagrana Vedike for the protest against students wearing Hijab. Shot by our reporter @BombayBombil#HijabRow #BOOMReports pic.twitter.com/p83mKUotCx
— BOOM Live (@boomlive_in) February 8, 2022
"ఉడిపిలోని అన్ని కాలేజీల్లో హిజబ్ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. హిజబ్ను ధరించరాదన్నందుకు ముస్లిం విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేపారు. ఎంజీఎం కాలేజీలో కూడా హిజబ్ అంశం ఉందన్న విషయం తెలుసు. మన కాలేజీలో కూడా హిజబ్ వ్యవస్థకు చరమగీతం పాడాలి. ఈ విద్యాసంవత్సరంలోనే హిజబ్కు అంతం పలకాలి. అంతా కలిసి పోరాడితేనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి సోమవారం రోజున ప్రతి విద్యార్థి కాలేజీకి వచ్చేసమయంలో తప్పనిసరిగా కాషాయ వస్త్రాన్ని కాలేజీ బ్యాగ్లో పెట్టుకుని తీసుకురండి. ఆర్గనైజర్లు మరో మెసేజ్ పంపేవరకు దాన్ని బయటకు తీయకండి. హిందూ జాగరణ వేదిక నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కాషాయ వస్త్రాన్ని మీ భుజాలపై ధరించి కాలేజీలోకి ప్రవేశించండి. " అని ఆ సందేశం సారాంశంగా ఉంది. చివరిగా జైశ్రీరాంతో ఆ సందేశం ముగిసింది.
ఇదిలా ఉంటే ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరో తెలియదని కాలేజీకి చెందిన వ్యక్తి చెప్పారు. ఈ సందేశం అన్ని తరగతుల విద్యార్థుల గ్రూపులో సర్క్యులేట్ చేయడం జరిగిందని చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, కచ్చితంగా ఈ కాలేజీకి చెందిన విద్యార్థులు లేదా వ్యక్తుల నుంచి మాత్రం రాలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బయటపడ్డ వీడియోలను ఆధారంగా చేసుకుని అక్కడి విద్యార్థులను న్యూస్ మినిట్ పలకరించినట్లు తన కథనంలో పేర్కొంది. దీంతో అసలు విషయం బయటపడిందని వెల్లడించింది. ఈ తంతును మొత్తం నడిపింది జాగరణ వేదిక అనే హిందూ సంస్థ అనే విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారమే ఆందోళన చేయాలని సర్క్యులేట్ అయిన మెసేజ్లో ఉన్నప్పటికీ సోమవారం రోజున అలాంటిదేమీ జరగలేదు. అయితే మంగళవారం రోజున మాత్రం ఎంజీఎం కాలేజీలో హిజబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలతో కొందరు విద్యార్థులు వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే విద్యార్తుల ముసుగులో బీజేపీ నేత యష్పాల్ సువర్ణ అక్కడ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. నినాదాలు చేస్తున్న విద్యార్థుల మధ్య ఈ నేత ఉన్నారని న్యూస్ మినిట్ వెల్లడించింది.
Recommended Video
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంజీఎం కాలేజీ అధికారులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారంతా కాలేజీకి సమీపంలో ఉన్న ఆజమ్మ కేఫ్లో వేచిఉన్న హిందూ జాగరణ వేదిక సభ్యుల దగ్గరకు పరుగులు తీయడంతో అసలు కుట్రబయట పడిందని న్యూస్ మినిట్ తన కథనంలో పేర్కొంది. హిందూత్వ సంస్థకు చెందిన పలువురు నాయకులు నేతలు అక్కడే వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక హిందూ జాగరణ వేదిక సంస్థ లేదని అన్నారు ఉడిపి జిల్లా ప్రెసిడెంట్ ప్రశాంత్ నాయక్ చెప్పారు. ఇదిలా ఉంటే కేఫ్ వద్ద ఉన్న హిందూ జాగరణ వేదిక సంస్థకు చెందిన సభ్యుల వద్దకు విద్యార్థులు చేరుకోగానే వారి నుంచి కాషాయ వస్త్రాలు తీసుకుని వాటిని ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే దృశ్యం న్యూస్ మినిట్ కంటపడింది.