‘హిమాచల్’లో చివరి రోజు 275 నామినేషన్లు, బరిలో టాప్ టెన్ సంపన్నులు!
హిమాచల్ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 479 మంది పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 479 మంది పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. దీంతో నిన్న ఒక్కరోజే 275 మంది తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రేమ్ కుమార్ ధుమల్ కూడా ఉన్నారు.
టియోగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు నామినేషన్లు వేయడం గమనార్హం. సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మంత్రి విద్యా స్టోక్స్ టియోగ్ నుంచి బరిలోకి దిగగా.. ఇదే స్థానానికి మరో కాంగ్రెస్ నేత దీపక్ రాఠోడ్ కూడా నామినేషన్ వేశారు. అయితే విద్యా స్టోక్స్ మాత్రమే పార్టీ అధికారిక అభ్యర్థి అని కాంగ్రెస్ వెల్లడించింది.
ఇక ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సోలన్ జిల్లాలోని అక్రీ నుంచి ,ఆయన కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా(రూరల్) నుంచి పోటీ చేస్తున్నారు. 20 మందికి పైగా కాంగ్రెస్, భాజపా తిరుగుబాటు నేతలు ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా నిలబడ్డారు.
నేడు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. అక్టోబర్ 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు. నవంబర్ 9న హిమాచల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
బరిలో టాప్ టెన్ సంపన్నులు...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి దిగిన అభ్యర్థుల్లో టాప్ టెన్ సంపన్నుల వివరాలను ఓ ఆంగ్ల పత్రిక విడుదల చేసింది. వారిలో హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కుమారుడు విక్రమాదిత్య రూ.84.32 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఆస్తులు రూ.84.32 కోట్లు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈయనకు భూములు ఉన్నాయి. ఇక మరో కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీఎస్ బాలికి రూ.47.67 కోట్ల ఆస్తులున్నాయి. ఈయనకు మాల్స్, హోటల్, ఓ ఆసుపత్రి ఉంది.
బీజేపీ నుంచి బరిలో నిలిచిన అనిల్ శర్మ ఆస్తులు రూ.37 కోట్లు. అయితే ఈయన ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇక హిమాచల్ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి వీరభద్ర సింగ్ ఆస్తులు రూ.30 కోట్లు. ఆరుసార్లు హిమాచల్ సీఎంగా ఎన్నికైన వీరభద్రసింగ్పై అక్రమాస్తులకేసులు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ కే చెందిన మరో అభ్యర్థి రాజేందర్ రానా. ఈయన ఆస్తులు రూ.26.7 కోట్లు. ఈయన సోషల్ వర్కర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. మరో కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ బుతైల్ ఆస్తులు రూ.21 కోట్లు. విధాన్ సభ స్పీకర్ అయిన బీబీఎల్ బుతైల్ కుమారుడైన ఆశిష్కు ఓ టీ గార్డెన్ ఉంది.
స్వతంత్య్ర అభ్యర్థి ప్రకాశ్ రానాకు రూ.20.8 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయన దుబాయ్లో వ్యాపారం చేస్తుంటారు. బీజేపీకే చెందిన మహేశ్వర్ సింగ్ ఆస్తులు రూ.18 కోట్లు. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు ప్రాంతంలో ఈయనకు ఓ ప్యాలెస్, భూములు ఉన్నాయి.
మరో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ సింగ్ ఆస్తులు రూ.16.22 కోట్లు కాగా ఈయనకు హోటల్ వ్యాపారం ఉంది. అలాగే వీరభద్ర సింగ్ మేనల్లుడు పృథ్వీ విక్రమ్ సేన్ కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈయన ఆస్తులు రూ.6.85 కోట్లు.