ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతో తెలుసా..?
ముంబై: అమెరికాలో స్థిరపడిన భారతీయుల సంఖ్య ఎక్కువే. ఇక ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లే ఇండియన్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అక్కడకు వెళ్లిన భారతీయులు అత్యధికంగా మాట్లాడే భాషపై ఓ నివేదిక బయటకువచ్చింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధిక భారతీయులు మాట్లాడే భాష ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అత్యధికులు మాట్లాడే భారతీయ భాష హిందీ
అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో అత్యధిక శాతం హిందీ భాష మాట్లాడుతారని అమెరికన్ కమ్యూనిటీ సర్వే వెల్లడించింది. ఆ తర్వాత గుజరాతీ ఆపై తెలుగు భాష ఎక్కువమంది భారతీయులు మాట్లాడతారని సర్వే స్పష్టం చేసింది. జూలై 1, 2018 వరకు తీసిన గణాంకాల ప్రకారం 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2017తో పోలిస్తే 1.3శాతం ఎక్కువగా ఈ సంఖ్య ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఎనిమేదళ్లుగా చూసినట్లయితే అంటే 2010 నుంచి లెక్కకడితే అమెరికాలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 2018 నాటికి 2.65 లక్షలుగా తేలింది. అంటే 43.5శాతం పెరుగుదల కనిపించిందని సర్వే స్పష్టం చేసింది.
పర్సెంటేజ్ల ప్రకారం చూస్తే తెలుగు టాప్
పర్సెంటేజీల ప్రకారం చూస్తే తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉందని సర్వే స్పష్టం చేసింది. 2010 నుంచి 2018వరకు అమెరికాలో తెలుగు మాట్లాడే వారు 79.5శాతంగా నమోదైనట్లు సర్వే వెల్లడించింది. జూలై 1,2018 వరకు అమెరికా జనాభా లెక్కలను అమెరికన్ కమ్యూనిటీ సర్వే విడుదల చేసింది. దీని ప్రకారం ఐదేళ్లు పైబడిన వారంతా దాదాపు 67.3 శాతం ఇంగ్లీషు తప్ప మిగతా భాషల్లో సంభాషిస్తున్నట్లు గణాంకాలు తెలిపాయి. అమెరికన్ కమ్యూనిటీ సర్వే అనే ఈ సంస్థ అమెరికా ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2 మిలియన్ గృహాల్లో నివసించే ప్రజల జీవనశైలిపై నివేదిక సమర్పిస్తుంది.
ఇతర దేశాలు వారు కూడా బెంగాళీ తమిళ భాష మాట్లాడుతారు
అమెరికాలో స్థిరపడిన బెంగాళీలు 3.75 లక్షల మంది ఉండగా 8 ఏళ్ల కాలంలో బెంగాళీ మాట్లాడే వారు 68శాతంగా ఉందని పేర్కొంది. దీని తర్వాత 67.5శాతం అంటే 3.08 లక్షల మంది తమిళం మాట్లాడుతున్నట్లు సర్వే వివరించింది. అయితే ఒక్క భారతీయులే కాకుండా ఇతర దేశాల వారు కూడా బెంగాళీ మాట్లాడుతున్నారనే విషయం ఇక్కడ గమనించాలని తెలిపింది. అంటే బంగ్లాదేశీయులు కూడా బెంగాళీ మాట్లాడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక శ్రీలంక, మలేషియా, సింగపూర్నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వారు తమిళంలో సంభాషిస్తారని వెల్లడించింది.
ఐటీ రంగంలో స్థిరపడ్డ అత్యధిక తెలుగు ప్రజలు
ఇక 2017 నుంచి 2018 మధ్య గుజరాతీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పుకొచ్చింది. గుజరాతీ మాట్లాడే వారి సంఖ్య 2018 నాటికి 4.19 లక్షలుగా రికార్డ్ అయ్యింది. ఇది 2017తో పోలిస్తే 3.5శాతం తగ్గింది. ఇక తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షలుగా ఉంటే 2017లో ఈ సంఖ్య 4.15లక్షలుగా ఉన్నిందని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలామంది ఐటీ రంగంలో స్థిరపడిన వారు తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతారని సర్వే వెల్లడించింది.
ప్రపంచ దేశాల భాషల్లో తొలి రెండు స్థానాల్లో స్పానిష్ చైనీస్
1990 నుంచి చూసుకున్నట్లయితే ఇంగ్లీషు తప్ప ఇతర విదేశీ భాషలు మాట్లాడే వారి సంఖ్య 2018 నాటికి రెట్టింపు అయినట్లు సర్వే స్పష్టం చేసింది. అమెరికాలో ఐదు అతిపెద్ద నగరాలను తీసుకున్నట్లయితే 48 శాతం మంది ఇంగ్లీషు కాకుండా విదేశీ భాషలో మాట్లాడుతున్నట్లు సర్వే వెల్లడించింది. న్యూయార్క్లో 49శాతం, లాస్ఏంజెలెస్లో 59 శాతం, షికాగో 36శాతం, హూస్టన్ మరియు ఫీనిక్స్లో 59శాతం,38 శాతం మంది ఇంగ్లీషు తప్ప ఇతర భాషల్లో మాట్లాడుతున్నట్లు సర్వే లెక్కలు కట్టింది. ఇక సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ ప్రకారం అమెరికాలో ఇంగ్లీషు కాకుండా స్పానిష్ భాషలో 4.5 మిలియన్ మంది మాట్లాడుతుండగా చైనీస్ 6.63 లక్షల మంది మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. అరబిక్ 3.94 లక్షల మంది మాట్లాడుతున్నట్లు సమాచారం.