హిందువులకు భారతే దిక్కు, వారెక్కడికి వెళ్తారు: మోడీ
డిస్పూర్: హిందువులకు భారతే ఏకైక స్థావరమని, వలస వచ్చిన వారిని ఆదుకోవాల్సి ఉందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ శనివారం అన్నారు. బంగ్లా హిందూ శరణార్థులను క్యాంపుల్లో నిర్బంధించడం అన్యాయమని, చైనా విస్తరణ కాంక్ష సరికాదన్నారు. బంగ్లా నుంచి వలసవచ్చే హిందువులకు దేశంలో చోటివ్వాల్సిన బాధ్యత మనపై ఉందని, అలాగే ఓటు బ్యాంకులుగా మారుతున్న వలసవాదులను వెనక్కి పంపించాలన్నారు.
తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లా నుంచి వలస వచ్చిన హిందువులను ఉంచిన డిటెన్షన్ క్యాంప్లను రద్దు చేస్తామన్నారు. అసోంలోని సిల్చార్కు సమీపంలోని రాంనగర్లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రకటించారు. ఇతర దేశాల్లో వేధింపులకు, కష్టాలకు గురవుతున్న హిందువులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వాళ్లు ఎక్కడికి పోతారు? వాళ్లకు ఉండేది భారతదేశం ఒక్కటేనని, తమ ప్రభుత్వం వాళ్లను వేధించడాన్ని కొనసాగరాదన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా అత్యంత సున్నితమైన బంగ్లాదేశ్ వలసల సమస్యను లేవనెత్తడం ద్వారా మోడీ ఒక కొత్త వివాదానకి తెరదీసినట్టయ్యింది. బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వలస వచ్చే వారిలో రెండురకాల వాళ్లున్నారని, ఒక వర్గం ఒక రాజకీయ పార్టీ (కాంగ్రెస్) వోటు బ్యాంకు రాజకీయ కుట్రలో భాగంగా వలస వచ్చినవారు కాగా, మరోవర్గం ఆ దేశంలో వేధింపులకు గురైన వచ్చిన వారని మోడీ అన్నారు.
స్థానికుల ఉద్యోగాలను లాక్కోవడమే కాకుండా రాజకీయ కుట్రను మనసులో పెట్టుకుని వలస వచ్చిన వారిని వెనక్కి పంపించాలన్నారు. అసోంకు, గుజరాత్కు చాలా దగ్గర పోలికలున్నాయని, అసోంకు ఆనుకుని బంగ్లా ఉంటే, గుజరాత్ పక్కన పాకిస్తాన్ ఉందన్నారు. బంగ్లాదేశీయులు అసోంకు సమస్యగా మారుతుంటే మొత్తం పాకిస్తాన్ తనను చూసి భయపడుతోందన్నారు.