అంబానీకి బాంబు బెదిరింపు : హిరేన్ మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు... బతికుండగానే...
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో కలకలం రేపిన పేలుడు పదార్థాల వాహనం యజమానిగా భావిస్తున్న హిరేన్ మన్సుఖ్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హిరేన్ను చంపి నీళ్లలో పడేసినట్లు మొదట అనుమానించిన ఏటీఎస్(యాంటీ టెర్రరిజం స్క్వాడ్)... అతన్ని బతికుండగానే నీళ్లలో తోసి చంపినట్లు తాజాగా అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత కోసం హిరేన్ డయాటమ్ బోన్ శాంపిల్స్ను హర్యానాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించినట్లు వెల్లడించింది.
హిరేన్కు క్లోరోఫామ్...?
నీళ్లలో పడటం ద్వారానే మరణం సంభవించిందా లేదా అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు డయాటమ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను నిర్వహించడంలో హర్యానా ఫోరెన్సిక్ అత్యంత నైపుణ్యం కలిగి ఉందని ముంబై జేజే ఆస్పత్రి సమర్పించిన నివేదికలో వెల్లడించినట్లు ఏటీఎస్ పేర్కొంది. అందుకే శాంపిల్స్ను హర్యానా ల్యాబ్కు పంపించినట్లు తెలిపింది. బహుశా హిరేన్కు మొదట క్లోరోఫామ్ మత్తుమందును ఇచ్చి... అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక నీళ్లలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ సమయంలో సచిన్ ఎందుకున్నట్లు?
హిరేన్ పోస్టుమార్టమ్కు సంబంధించి విసెరా,రక్త నమూనాలు,గోరు క్లిప్పింగ్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో హిరేన్ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన ముగ్గురు వైద్యుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని తెలిపారు. అంతేకాదు,పోస్టుమార్టమ్ సమయంలో సచిన్ వాజే ఆస్పత్రిలో ఎందుకు ఉండాల్సి వచ్చిందో కూడా తేలుస్తామన్నారు.హిరేన్ భార్య విమలా మాట్లాడుతూ... తన భర్త కచ్చితంగా హత్యకు గురయ్యాడని ఆరోపించారు. హిరేన్కు ఈత వచ్చని... అతను నీళ్లలో మునిగి చనిపోయే అవకాశం లేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా అరెస్టయిన పోలీస్ అధికారి సచిన్ వాజేపై విమల అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
బిగుస్తున్న ఉచ్చు...
ఫిబ్రవరి 25న అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసింది ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే అని ఏటీఎస్ ఇప్పటికే నిర్దారించింది. భారీ సైజు కుర్తా-పైజామా ధరించి తన బాడీ లాంగ్వేజ్ కనిపించకుండా సచిన్ జాగ్రత్తపడ్డాడని పేర్కొంది. ఆ స్కార్పియో వాహనాన్ని తన నుంచి తీసుకుని సచిన్ వాజే కొన్ని నెలలు వాడుకున్నట్లు హిరేన్ చనిపోకముందు తన వాంగ్మూలంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సచిన్ వాజే ఆ వాహనాన్ని తనకు తిరిగి అప్పగించిన కొద్దిరోజులకే అది అపహరణకు గురైందని హిరేన్ పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాంబు కలకలం,హిరేన్ హత్య కేసు రెండూ సచిన్ వాజే చుట్టూ తిరుగుతున్నాయి. ఏ క్షణమైనా ఆయనకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.