"చరిత్ర నన్ను దయతో చూస్తుంది"-గర్వంగా చెప్పుకున్న మన్మోహన్..!
భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధలో, అదీ రాజకీయ నాయకుడిగా కీలక పదవిలో పదేళ్ల పాటు ఉన్న ఓ నేత తనను చరిత్ర దయతో గుర్తుంచుకుంటుందన్న మాట చెప్పాలంటే ఎంత కష్టం. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం 2014లో తాను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా అందరికీ తెలిపారు. అయితే అంత గర్వంగా చెప్పుకోవడానికి కారణమైన మన్మోహన్ కెరీర్ హైలెట్స్ ఓసారి చూద్దాం..
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్ధిక వేత్తగా ఉన్న తనను ఆర్ధిక మంత్రిని చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఉప్పొంగిపోలేదు. తన ముందున్న సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పట్టు వదలకుండా పోరాటం చేశారు. భారత్ ను పేదరికం నుంచి ఎలా బయటపడేయాలి, ఆర్ధిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, ఉన్న వనరుల్ని వాడుకుంటూనే స్వయం సమృద్ధి ఎలా సాధించాలన్న అంశాల చుట్టూనే ఆయన మనసు తిరిగింది. పీవీ హయాంలో ఆర్దిక మంత్రిగా ఐదేళ్లే ఉన్నా ఆ తర్వాత తరాలకు సరిపడా సంస్కరణలు అప్పట్లోనే తీసుకొచ్చిన మేథావి మన్మోహన్.

11 రోజుల వ్యవధిలో రెండుసార్లు రూపాయి విలువ తగ్గింపు దగ్గరి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారులు తెరవడం, దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా గ్లోబలైజేషన్ కు తాము సిద్దంగా ఉన్నట్లు ప్రపంచానికి మన్మోహన్ పంపిన సంకేతాలు ఆర్ధిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి.ఆర్ధిక సరళీకరణ విధానాలతో ప్రపంచ చిత్ర పటంలో భారత్ ను నిలబడేలా చేసిన మన్మోహన్ 2004లో ప్రధాని అయ్యాక పదేళ్ల పాటు ఆర్ధిక సంస్కరణలను మరింత వేగంగా చేపట్టి ఆర్దిక వృద్ధి సాధించేలా చేశారు. అందుకే అంత ధైర్యంగా చరిత్ర తనను దయతో గుర్తిస్తుందని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications