సల్మాన్ ఖాన్ను వదిలేసిన బాధితుడు! ఇంకెవరు చంపారని కంటతడి
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను ముంబై హైకోర్టు గురువారం నిర్దోషిగా తేల్చింది. దీని పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సల్మాన్ ఖాన్ తీర్పును స్టడీ చేస్తామని చెప్పారు.
హిట్ అండ్ రన్ కేసులో కోర్టు నిర్దోషిగా తేల్చింది. దీంతో అతనికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోయినట్లుగా కనిపించడం లేదు. ఈ కేసులో మరోసారి అప్పీల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తాము ఇంకా తీర్పు కాపీని చూడలేదని ఫడ్నవీస్ చెప్పారు.
తీర్పును పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దాని పైన నిర్ణయిస్తామన్నారు. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై న్యాయ నిపుణుల సలహా కోరుతామన్నారు. మరోవైపు, ఈ కేసులో తమకు అన్యాయం జరిగిందని బాధితుడు వాపోతున్నాడు.
హిట్ అండ్ రన్ కేసులో ఫిరోజ్ షేక్ తన తండ్రిని కోల్పోయాడు. తీర్పు నేపథ్యంలో ఫిరోజ్ షేక్ మాట్లాడుతూ... తమకు అన్యాయం జరిగిందని చెప్పాడు. తన తండ్రిని సల్మాన్ ఖాన్ కాకుంటే ఇంకా ఎవరు చంపారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తీర్పు వెలువడిన తర్వాత సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. పదమూడేళ్ల తర్వాత తీర్పు తనకు అనుకూలంగా రావడంతో సల్మాన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అదే సమయంలో తండ్రిని కోల్పోయిన ఫిరోజ్ కూడా తనకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
సల్మాన్ ఖాన్కు శిక్ష గురించి తమకు అవసరం లేదని, తమను ఆర్థికంగా ఆదుకోవాలన్నాడు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు శిక్ష పడుతుందా లేదా తమకు అనుసరమని కూడా అతను అభిప్రాయపడ్డాడు. ఆయనకు శిక్ష పడినా, పడకున్నా మా జీవితంలో మార్పు ఉండదన్నాడు.
కోర్టులో కన్నీళ్లు పెట్టిన నిర్దోషి సల్మాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కంట నీళ్లు వచ్చాయి. హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా తేలడంతో దుఖ్కాన్ని ఆపుకోలేకపోయాడు. ముంబై హైకోర్టులో కుటుంబసభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. కోర్టు తీర్పు సమయంలో సల్మాన్ చుట్టూ కుటుంబసభ్యులు చేరుకున్నారు. సల్మాన్ నిర్దోషిత్వం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. పలువురు అతనికి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
అండగా నిలిచిన వారికి సల్మాన్ ఖాన్ కృతజ్ఞతలు
హిట్ అండ్ రన్ కేసులో తనకు మొదటి నుంచి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సల్మాన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పుపై సల్మాన్ స్పందిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నానని, కేసులో మొదటి నుంచి తనకు అండగా నిలిచిన నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానుల మద్దతుకు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.