ఆరు రాష్ట్రాల్లో కండోమ్స్ కొరత: ఆంధ్రప్రదేశ్లో పెరిగిన వాడకం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కండోమ్స్ దొరకడం లేదు. హెఐవి ఎయిడ్స్ వ్యాపించకుండా కండోమ్స్ ఎక్కువ మొత్తంలో వాడుతుండటం, డిమాండ్ తగినట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ సమస్యల ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కండోమ్స్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా కండోమ్స్ వాడుకడం అత్యధిక స్థాయిలో ఉంది.
ఆ తర్వాత స్థానాల్లో హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు ఎనిమిది నెలలుగా కండోమ్స్ కొరత సమస్యను ఈ రాష్ట్రాలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. కండోమ్ల పంపిణీలో ఆలస్యంగా కారణంగా ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉచితంగా కండోమ్లను సరఫరా చేసేది. ప్రధానంగా లారీ డ్రైవర్ల వంటి హైరిస్క్ గ్రూపులకు వీటిని ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, కారణాలేంటో తెలియదు గానీ, ఇటీవలి కాలంలో కండోమ్ ల సేకరణ బాగా తగ్గిపోయింది. దీంతో వీటి సరఫరా కూడా ఆగిపోయింది.
కాగా, కండోమ్స్ కొరత అంశం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) అధికారులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసి విషయం చెప్పారు. కండోమ్స్ తోపాటు హెచ్ఐవి టెస్టింగ్ కిట్ల కొరత కూడా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది.