హింసకు నిధులు: హిజ్బుల్ ఛీఫ్ కొడుకు సయ్యద్ షకీల్ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై హిజ్బుల్ ముజాహిద్దీన్ ఛీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు సయ్యద్ షకీల్ యూసఫ్ను శ్రీనగర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అరెస్టు చేసింది. రాంబాగ్లోని తన నివాసంలో ఎన్ఐఏతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి షకీల్ యూసఫ్ను అరెస్టు చేశారు. షెహర్-ఈ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో షకీల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈయన సయ్యద్ సలాహుద్దీన్కు రెండవ కుమారుడు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఛీఫ్గా ఉన్న సలాహుద్దీన్... యునైటెడ్ జీహాద్ కౌన్సిల్కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. అమెరికా లో ఉండే ఐజాజా అహ్మద్ భట్ నుంచి షకీల్ నిధులు పొందేవాడని ఎన్ఐఏ స్పష్టం చేసింది. భట్కు భారతదేశంలో ఉన్న మిత్రుల్లో షకీల్ కూడా ఒకరని ఎన్ఐఏ పేర్కొంది. టెలిఫోన్ ద్వారా వీరిద్దరూ నిధుల బదిలీపై మాట్లాడుకునేవారని తెలిపింది. కశ్మీర్లో హింస సృష్టించేందుకు లష్కరే తొయిబా అధినేత హఫీజ్ మహ్మద్ నుంచి వేర్పాటు సంస్థ అయిన ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్, హిజ్బుల్ ముజాహీద్దీన్, లష్కర్-ఈ-తొయిబా, దుఖ్తరన్-ఈ-మిలాత్లు నిధులు సమకూర్చుకునేవనే ఆరోపణలపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిపై ఛార్జిషీటు దాఖలు చేసింది ఎన్ఐఏ. ఇందులో ఒకరుగా ఉన్న జీఎం భట్, వేర్పాటువాది సయ్యద్ అలి షా గిలానీకి సన్నిహితుడు.
జనవరిలో ఎన్ఐఏ ఏడు మంది వేర్పాటువాదులపై కూడా కేసు నమోదు చేసింది. గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా, హురియత్ మీడియా సలహాదారుడైన అఫ్తాబ్ అహ్మద్ షా, ఫరూఖ్ అహ్మద్ దార్ , కశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వతాలి, మిలిటెంట్లు అయిన హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్లపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. వీరిలో కొందరిని జూలై 2017లో అరెస్టు చేసి జైలుకు తరలించింది.