ఇంటి పనులు కూతుళ్లకేనా? కొడుకులకు నేర్పిస్తే..! వైరల్ యాడ్
హైదరాబాద్ : కూతురు, కొడుకు.. వీరిద్దరిలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ఇలా అడిగితే సాధారణంగా అందరూ ఒక్కటే జవాబిస్తారు. కొడుకుకే జై కొడతారు. అయితే రానురాను అలాంటి పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నా.. సమాజంలో దాగున్న జాఢ్యం మాత్రం ఇంకా ఆడపిల్లపై వివక్ష చూపిస్తూనే ఉంది. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళుతున్నా.. మగవారికి తామేమీ తక్కువ కాదంటూ నిరూపిస్తున్నా.. సమాజం గిరి గీసిన చట్రంలో వారు బందీలుగానే మిగిలిపోతున్నారు.
ఆలోచన రేకెత్తించే ప్రకటన
అలాంటి నేపథ్యంలో ఇటీవల వచ్చిన ఓ యాడ్.. మనసులను తట్టి లేపుతోంది. కూతుళ్లకు ఇంటి పనులు, వంట పనులు నేర్పుతున్న మనం.. కొడుకులకు నేర్పిస్తున్నామా? అనేది ఆ ప్రకటన సారాంశం. ప్రముఖ డిటర్జెంట్ పౌడర్ సంస్థ రిలీజ్ చేసిన ఆ యాడ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
యాడ్ సారాంశం :
తనకు తాను నిరూపించుకోవాలని ఓ కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తుంది. అయితే పెళ్లి తర్వాత జాబ్ మానేయాల్సిన పరిస్థితి. ఇంటి పనులతో సతమతమవుతూ ఉద్యోగం భారంగా మారడంతో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు వాళ్ల అమ్మకు ఫోన్ చేసి అదే విషయం చెబుతుంది. ఉద్యోగం మానేస్తున్నానని కూతురు చెప్పగానే తల్లి ఆశ్చర్యపోతుంది. నీకు ఉద్యోగం చేయడం ఇష్టం కదా, మరి ఎలా వదులుకుంటావని ప్రశ్నిస్తుంది. లేదమ్మా, తప్పదు. ఎందుకంటే మా ఆయన ఇంటిపనుల్లో నాకు సహకరించడం లేదు. ఇంటి పనిభారమంతా నాపైనే పడుతోంది. అందుకే ఉద్యోగం మానేద్దామనుకుంటున్నా అని సమాధానం ఇస్తుంది కూతురు. ( వీడియో బ్యాక్ డ్రాప్ లో ఆ తల్లి తన కొడుక్కి టిఫిన్ అందించడం, చిందరవందరగా పాడేసిన బట్టలు సర్దడం లాంటి పనులు చేస్తూ ఫోన్లో మాట్లాడుతుంటుంది ). అప్పుడు ఆ తల్లి తప్పంతా మనదే. కొడుకులకు కూడా పని నేర్పితే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని అనుకుంటుంది. ఇంటి పనుల్లో తన కూతురుకు అల్లుడు సాయంగా ఉంటే ఆమె ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా అనేది ఆ తల్లి అంతరంగం. ఫోన్ పెట్టేసిన తర్వాత కొడుకు చేతికి బట్టలు ఇచ్చి వాషింగ్ మెషిన్ లో వేయిస్తుంది. తన కొడుక్కి పనులు నేర్పిస్తే వచ్చే కోడలికి ఇబ్బంది ఉండదు కదా అనేది ఆ సన్నివేశంలో కనిపిస్తుంది. మా వాడికి ఇంటి పనులు చేయడం వస్తే కోడలికి ఆసరాగా ఉండి ఆమె ఉద్యోగం చేయాలనుకునే ఆశ నెరవేరుతుంది కదా అని ఆలోచిస్తుంది. ఇలా సాగే ఆ యాడ్.. చూసిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
అమ్మలు ఆలోచించండి.. నేహా ధూపియా ట్వీట్
సరికొత్తగా కనిపిస్తున్న ఈ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటిపనుల్లో కూతుళ్లనే కాదు కొడుకులకు కూడా భాగస్వామ్యం చేయాలనే కాన్సెప్ట్ తో తీర్చిదిద్దిన ఈ ప్రకటన శభాష్ అనిపించుకుంటోంది. భార్యభర్తలంటే చెరో సగమనే విధంగా, ఇంటిపనులతో పాటు ప్రతి విషయాన్ని ఇద్దరూ షేర్ చేసుకోవాలన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. మారుతున్న కాలంలోనూ ఆడపిల్లలపై వివక్ష ఎందుకన్నట్లుగా కనిపిస్తుంది ఈ ప్రకటన. దీనిపై ప్రముఖ సినీ నటి నేహా ధూపియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పిల్లల మధ్య వ్యత్యాసం చూపించొద్దని అభిప్రాయపడ్డారు. కొడుకులు, కూతుళ్లకు తాము ఏమి నేర్పిస్తున్నామనే దానిపై ఇప్పటికైనా తల్లులు ఆలోచించాల్సిన అవసరముందన్నారు.