ఒక మంత్రే 100 కోట్లు అడిగితే.. మరి ప్రభుత్వం?: కేంద్రమంత్రి ఫైర్, సీఎం ఉద్దవ్ను కలిసిన అనిల్ దేశ్ముఖ్
ముంబై: భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ఆయన నివాసంలో కలిశారు. సుమారు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చ కొనసాగింది. హోంమంత్రి.. నెలకు రూ. 100 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టారంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామాకు డిమాండ్ చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలో సీఎంతో మంత్రి అనిల్ దేశ్ముఖ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒక మంత్రే 100 కోట్లు అడిగితే.. మరి ప్రభుత్వం?
పరమ్ వీర్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్ళు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. అది మహారాష్ట్ర వికాస్ అఘాడీ కాదని.. మహారాష్ట్ర వసూలీ అఘాడీ అని ఎద్దేవా చేశారు. ఒక్క మంత్రే రూ. 100 కోట్లు అడిగితే.. మొత్తం ప్రభుత్వం ఎంత అడిగి ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు.
బదిలీ రాకెట్ వెలికితీసిన అధికారిణి బదిలీ చేస్తారా?
రాష్ట్రంలో బదిలీ రాకెట్ను వెలికితీసిన ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని కేంద్రమంత్రి తప్పుబట్టారు. మహారాష్ట్రలో బదిలీ, పోస్టింగ్ రాకెట్ నడుస్తోందన్నారు. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకుంటుందని తాము భావించామని, కానీ, ప్రభుత్వం మాత్రం అందుకు బదులుగా రాకెట్ ను వెలికితీసిన రష్మీ శుక్లాపై చర్యలు తీసుకుందని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజే అరెస్ట్, ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ బదిలీ.. ఈ క్రమంలో అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పరమ్ వీర్ శనివారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. అంతేగాక, దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Recommended Video
6.3 గిగా బైట్ల కాల్ డేటా, ఆధారాలున్నాయంటూ మాజీ సీఎం ఫడ్నవీస్
మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు అధికారుల బదిలీల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి తన వద్ద 6.3 గిగాబైట్ల కాల్ డేటా, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ కుంభకోణం గురించి ఆధారాలతో సమాచారం అందించిన అధికారిని ఒక అనామక పోస్టుకు బదిలీ చేశారని రష్మీ శుక్లా అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. బదిలీల కుంభకోణంపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన కాల్ డేటాతో కూడిన నివేదిక 2020 ఆగస్టు నుంచి ఆయన వద్దే ఉందన్నారు. ఆ డేటాను ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందజేస్తానని చెప్పారు. ఐపీఎస్ అధికారులకు ఆయనే కస్టోడియన్ అని.. ముఖ్యమంత్రి ఇంఛార్జీ అని ఫడ్నవీస్ అన్నారు. ఇక అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలపై సొంత పార్టీ సభ్యులే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను తప్పుదోవ పట్టించారని ఫడ్నవీస్ తెలిపారు.