హోం మంత్రి రాజ్నాథ్ బంధువును కాల్చి చంపారు
వారణాసి: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీప బంధువు దారుణ హత్యకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వారణాసి జిల్లా పూల్ పూర్ గ్రామం సమీపంలో అరవింద్ సింగ్ అనే వ్యాపారవేత్త హత్యకు గురైనారు.
రాజ్ నాథ్ సింగ్ కు సమీప బంధువు అయిన అరవింద్ సింగ్ పెట్రోల్ బంక్ యజమాని. మంగళవారం అర్ద రాత్రి కారులో భార్యను పిలుచుకుని ఎయిర్ పోర్టు దగ్గరకు వెళ్లారు. భార్యను విమానం ఎక్కించి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో పూల్ పూర్ గ్రామం దగ్గర బైక్ లో వచ్చిన దుండగులు కారును అడ్డగించారు.
ఆ సందర్బంలో అరవింద్ సింగ్ తో దుండగులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. సహనం కొల్పోయిన దుండగులు రివాల్వర్ తీసుకుని అరవింద్ సింగ్ మీద ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. అదే రహదారిలో వాహనాలు రావడంతో దుండగులు పరారైనారు.
అటు వైపు వెళుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అరవింద్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అరవింద్ సింగ్ మరణించారని వైద్యులు నిర్దారించారని పోలీసులు అన్నారు.
విషయం తెలుసుకున్న వారణాసి రూరల్ ఎస్పీ ఎ.కే. పాండే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగులు అరవింద్ సింగ్ ను ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని అన్నారు. సంఘటనా స్థలంలో .33 ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదూర్ పాఠక్ మండిపడ్డారు. నిత్యం ఉత్తర ప్రదేశ్ లో హత్యలు జరుగుతున్నాయని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? పోలీసులు ఉన్నారా ? అని అనుమానం వస్తున్నదని ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీప బంధవును నడి రోడ్డు మీద కాల్చి చంపి వెళ్లినా దిక్కులేదని మండిపడ్డారు. అరవింద్ సింగ్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.