మోడీ ప్రకటన తర్వాత.. గూగుల్లో ఎక్కువ మంది ఏం వెతికారంటే?
న్యూఢిల్లీ : 'పెద్ద నగదు నోట్ల రద్దు' దేశంలో ఎంతటి చర్చకు.. గందరగోళానికి గురిచేసిందో అందరికీ తెలిసిందే. ఎక్కువ డినామినేషన్ నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలన్న ఆత్రుతలో సామాన్యులుంటే.. అక్రమంగా సంపాదించిన డబ్బును ఎలా వైట్ చేసుకోవాలో అన్న ఆలోచనతో నల్ల కుబేరులకు కంటి మీద కునుకు లేకుండా పోయినట్టుంది.
అందుకేనేమో! ప్రధాని మోడీ నుంచి రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన వెలువడిన వెంటనే.. చాలామంది నెటిజెన్స్ 'బ్లాక్ ను వైట్ చేసుకోవడమెలా?' అన్న అంశం గురించి నెట్ లో సెర్చ్ చేశారట. మరింత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఇలా సెర్చ్ చేసిన రాష్ట్రాల జాబితాలో ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ టాప్ లో ఉండడం.
తాజాగా గూగుల్ ట్రెండింగ్ లిస్టు విడుదల కావడంతో.. ఈ విషయం స్పష్టమైంది. బ్లాక్ ను వైట్ చేయడం గురించి ఎక్కువగా గూగూల్ లో సెర్చ్ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత మహారాష్ట్ర, హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న కొత్త నోట్లలో ఉన్న ఫీచర్స్ గురించి ఎక్కువమంది ఇండియన్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతికినట్టు తేలింది.
మొత్తానికి ఏ నల్లధనాన్ని అరికట్టడానికైతే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందో.. ఆ నోట్లను తిరిగి చలామణిలోకి ఎలా తీసుకురావాలో అన్న ప్రయత్నాల్లో చాలామంది నల్ల కుబేరులు మునిగిపోయారన్నమాట.