జీఎస్టీ ఎఫెక్ట్: ఆన్లైన్ షాపింగ్కు కష్టకాలమే మరి!!
ఇటీవల మారిన ఆధునిక జీవనశైలితో ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరి జీఎస్టీ అమల్లోకి వస్తే ఆన్లైన్ ద్వారా జరిగే కొనుగోళ్లు ఎలా ఉంటాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వచ్చే శనివారం నుంచి అమల్లోకి రానున్నది. 'ఒకే దేశం - ఒకే పన్ను- ఒకే మార్కెట్' నినాదంతో జీఎస్టీ వస్తుండటంతో వివిధ వస్తువులు ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం సామాన్యులకు మేలు చేసే అంశం.
ఇటీవల మారిన ఆధునిక జీవనశైలితో ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరి జీఎస్టీ అమల్లోకి వస్తే ఆన్లైన్ ద్వారా జరిగే కొనుగోళ్లు ఎలా ఉంటాయి. వినియోగదారులకు అది లాభం చేకూరుతుందా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతానికి ఈ - కామర్స్ (ఆన్ లైన్ వ్యాపార) సంస్థలకు ఉపశమనం లభించనున్నది. దీంతో కొంత కాలం ఈ-కామర్స్ వెబ్సైట్లు పన్నును వసూలు చేయడం లేదు. జీఎస్టీ అమల్లోకి వస్తే మాత్రం కొనుగోలుదారుడు అమ్మకందారుడికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక శాతం పన్నును వసూలు చేస్తారు. దీంతో ఆన్లైన్ ద్వారా జరిపే కొనుగోళ్లలో కొద్దిగా ప్రియం కానున్నాయి.
వేగంగా ఆన్లైన్లో వస్తువుల డెలివరీ
జీఎస్టీ అమలు తర్వాత ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులు వేగంగా వినియోగదారుడి వద్దకు చేరతాయి. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రానికో స్టేట్మెంట్ తయారు చేయాల్సి వస్తోంది. శనివారం తర్వాత ఈ ప్రక్రియ తగ్గనున్నది. ప్రస్తుతం ఎలా ఉందంటే? ఉదాహరణకు బెంగళూరు వాసి.. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువు అమ్మే సంస్థ ఢిల్లీలో రిజిస్టర్డ్ అయి ఉంటే ఆ వస్తువు రవాణాకు వేర్వేరు బిల్లు ఉండాలి. దీనికి తోడు ఆ రాష్ట్ర పన్ను కూడా వస్తువుపై పడుతుంది. జీఎస్టీ వస్తే ప్రక్రియ అంతా పోవడమే కాక వేగంగా డెలివరీ కూడా అవుతుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ - కామర్స్ వెబ్సైట్లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇక ఇది భవిష్యత్లో అసాధ్యమే. ఎందుకంటే వారు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వస్తువు ధరపై విధించే పన్నును దానిని సరఫరా చేసే సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నుంచి అన్ని సందర్భాల్లోనూ తగ్గింపు ధరలను ప్రకటించడం సాధ్యం కాకపోవచ్చు.
రద్దు చేసుకుంటే కంపెనీలకు ఇబ్బందులు
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుడికి ప్రధానంగా ఎదురయ్యే సవాల్ వస్తువును తిరిగి ఇచ్చేయడం, రద్దు చేసుకోవడం. ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఇచ్చేయాలని భావించినా, రద్దు చేసుకున్నా ఈ - కామర్స్ కంపెనీలు సుమారు 18 శాతం వరకూ ఛార్జీలను వసూలు చేయనున్నాయి. తయారీదారుని వద్ద నుంచి వస్తువు వచ్చే సమయంలోనే పన్ను వసూలు చేస్తుండగా, వినియోగదారుడు దాన్ని రద్దు చేసుకుంటే ఆ భారం ఈ - కామర్స్ కంపెనీలే స్వయంగా భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందాలి. దీంతో వస్తువులను తిరిగే ఇచ్చేయడం, రద్దు చేసుకునే సమయంలో ముఖ్యంగా నగదు ప్రవాహం విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు.
20 లక్షల్లోపు అయితే నో రిజిస్ట్రేషన్
వాణిజ్యం, పరిశ్రమల వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా..సీజీఎస్టీ/స్టేట్ జీఎస్టీ చట్టం 2017 ప్రకారం టీడీఎస్, టీసీఎస్కు సంబంధించి నిబంధనలను అమలును ప్రస్తుతానికి కేంద్రం నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ కోసం ఈ - కామర్స్ కంపెనీలు, పంపిణీదారులకు మరింత ఎక్కువగా సమయం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ చట్ట ప్రకారం ఈ - కామర్స్ సంస్థలు అమలు చేయాల్సి ఉంది. రూ.20 లక్షల లోపు చిన్న, వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ - కామర్స్ సంస్థలు అందించే ఏ ఉత్పత్తిపై ఎలాంటి పన్నును విధించడం లేదు. ఆదివారం ప్రారంభమైన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ వారం చివరి నుంచే అమలులోకి రానున్న జీఎస్టీ నేపథ్యంలో రూ.20 లక్షలకు పైగా వార్షిక ఆదాయం కలిగిన వ్యాపారవేత్తలు క్యూ కట్టారు. జీఎస్టీతో దేశ ఆర్థిక వృద్ధిరేటు మరో 1-2 శాతం పెరుగనున్నదని విశ్షేకుల అంచనా.
ఫిర్యాదులకోసం అంబుడ్స్మెన్ను ఏర్పాటు చేయాలి: సీఏఐటీ
టీడీఎస్, టీసీఎస్ పన్ను విధింపును కేంద్ర ప్రభుత్వం మరికొంతకాలం వాయిదావేయడాన్ని ఆన్లైన్ సేవల సంస్థ అమెజాన్ స్వాగతించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద సేవలు అందిస్తున్న చిన్న స్థాయి సంస్థలకు లాభం చేకూరనున్నదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరించడానికి అంబుడ్స్మెన్ను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పన్నుకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటుండటంతో అప్పిలేట్ ఆథార్టీని సంప్రదిస్తున్నామని, అదే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఎవర్నిని సంప్రదించేదానిపై స్పష్టతలేదని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖందేల్వాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలో 60 శాతం మందికి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేదన్నారు. జీఎస్టీపై వ్యాపారవర్గాలకు ఎలాంటి సమాచారం తెలియడం లేదని, దీంతో వచ్చే మార్చి 31 వరకు తాత్కాలిక అమలుగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన రెండేండ్ల వరకు పరివర్తన కాలంగా గుర్తించాలన్నారు.
కార్ల ధరలు ఇలా పెరుగుతాయి
జీఎస్టీ అమలులోకి రానున్న నేపథ్యంలో చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరుగనున్నాయి. నాలుగు మీటర్లలోపు పొడువు కలిగిన 1.2 లీటర్ల లోపు పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5 లీటర్ల లోపు డీజిల్ ఇంజిన్తో తయారైన చిన్నరకం కార్ల ధరలు స్వల్పంగా పెరుగనున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 12.5 శాతం సెంట్రల్ ఎక్సైజ్, 1 శాతం ఇన్ప్రా సెస్, 12.5-14.5 శాతం మధ్యలో వ్యాట్తో కలిపి 26-28 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ కార్లు 28 శాతం స్లాబ్లోకి రానున్నాయి. వీటితోపాటు పెట్రోల్ కార్లపై ఒక శాతం అదనంగా సెస్, డీజిల్ రకం కార్లపై మూడు శాతం అదనంగా చెల్లించాలి. ఈ పరిధిలోకి రానున్న రెనో క్విడ్ కారు రూ.2.65 లక్షల నుంచి రూ.2.71 లక్షలకు పెరుగనున్నది. డీజిల్ విభాగానికి చెందిన మారుతి సుజుకీ డీజైర్ రూ.21 వేలు ప్రియంకానున్నది. నాలుగు మీటర్ల కంటే అధిక పొడువు కలిగి, 1,500 సీసీ ఇంజిన్తో రూపొందించిన కార్లు 43 శాతం పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 41.5 శాతం పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత హోండా సిటీ బేసిక్ మోడల్ రూ.9 వేలు పెరిగి రూ.7.76 లక్షలకు చేరుకోనున్నది. కానీ లగ్జరీ, అతిపెద్ద కార్లు మాత్రం తగ్గనున్నాయి. ప్రస్తుతం ఈ కార్లపై 44.5 శాతం పన్ను విధిస్తుండగా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 43 శాతం స్లాబ్లోకి రానున్నాయి. దీంతో ధరలు 1.5 శాతం మేర తగ్గనున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం వీటిపై 48 శాతం పన్నును విధిస్తుండగా, జూలై 1 తర్వాత 43 శాతం పరిధిలోకి రానున్నాయి. దీంతో టయోటా ఫార్చ్యునర్ ధర రూ.28.26 లక్షల నుంచి రూ.27.21 లక్షలకు తగ్గనున్నది.
బాణా సంచాపై 28 శాతం జీఎస్టీ
జీఎస్టీకి వ్యతిరేకంగా బాణా సంచా తయారీదారులు సమ్మె బాట పట్టారు. ఈ నెల 30 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు తమిళనాడు ఫైర్వర్క్స్ అండ్ అమోర్సెస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు అసైథంబి తెలిపారు. జీఎస్టీ పన్ను విధానంలో 28 శాతం కింద చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ పన్నును 15 శాతానికి తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 811 ఫైర్వర్స్ యూనిట్ల యాజమానులు, కార్మికులు పాల్గొంటున్నారు. అలాగే ఢిల్లీలోని ఫర్నీచర్ తయారీదారులు మూడు రోజుల పాటు బంద్ పాటిస్తారు.