ఇద్దరు మంత్రులతో లింక్స్: ఎవరీ బాంబు నాగా?
మాజీ కార్పోరేటర్, రౌడీ షీటర్ నాగరాజ్ అలియాస్ బాంబు నాగా ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు దిమ్మతిరిగే నోట్లు బయటపడ్డాయి. ఇంతకీ అతని నేర చరిత్ర ఏమిటి...
బెంగళూరు: బిబిఎంపీ కార్పోరేటర్, రౌడీ వి నాగరాజు అలియాస్ బాంబు నాగా ఇంట్లో దిమ్మతిరిగే కరెన్సీ బయటపడిన విషయం తెలిసిందే. నాగరాజు కాస్తా బాంబు నాగాగా ఎలా మారాడనేది కూడా ఆసక్తికరమైన విషయమే. అతని నివాసంలో పోలీసులు రూ. 25 కోట్ల పాత నోట్లను, రూ. 10 కోట్ల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వందల కోట్ల విలువైన ఆస్తి దస్త్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నాలుగు లాకర్లను తెరవాల్సే ఉంది. ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు శుక్రవారంనాడు బెంగళూరులోని శ్రీరామపురాలోని అతని నివాసంపై దాడి చేశారు. అతనిది మూడు అంతస్తుల భవనం ఆ భవనంలో ఐదు గదులను అతను లాకర్లుగా మార్చేసుకున్నాడు.
#WATCH: Police raids office of former corporator V Nagraj in Bengaluru, recovers more than Rs. 40 crores of demonetised currency pic.twitter.com/GePuOpdmUp
— ANI (@ANI_news) April 14, 2017
నిజానికి, ఇంటి తలుపులు తెరిచి లోనికి వెళ్లడానికే పోలీసులకు దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. వాటిని పగులగొట్టడానికి పోలీసులు ప్రత్యేకంగా నిపుణులను పిలిపించారు. వారు తలుపు తెరిచే లోగానే నాగరాజ్ టెర్రాస్పై నుంచి పక్కింటి గోడపైకి ఎక్కి పారిపోయినట్లు తెలుస్తోంది.
నాగరాజ్ డిసెంబర్ 30వ తేదీ వరకు పెద్ద యెత్తున నోట్ల మార్పిడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దానికితోడు క్రికెట్ బెట్టింగ్, హత్య, హత్యాప్రయత్నాలు చేసినట్లు, పెద్ద యెత్తున నగదు కూడబెట్టుకున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం మీడియాకు తెలిపారు
వారితో కలిసి బెట్టింగ్ల నుంచి కిడ్నాప్ల వరకు...
ఉమేష్, ప్రవీణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి నాగరాజ్ క్రికెట్ బెట్టింగును నిర్వహించేవాడు. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన గొడవల కారణంగా అతను ఏప్రిల్ 7వ తేదీన దినేష్ను కిడ్నాప్ చేశాడు. అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.50 లక్షలు రాబట్టుకుని వదిలేశాడు. నాగరాజ్ వద్ద లైసెన్స్ లేని తుపాకి ఉందని హెణ్ణూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దినేష్ ఆరోపించాడు.
నాగరాజ్ తమిళనాడులోని ధర్మపురిలో నకిలీ నోట్లను ముద్రించి బెంగళూరులో మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై, ధర్మపురి ప్రాంతాలకు అతను పారిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని ఇద్దరు మంత్రులతో అతని సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను అరెస్టయితే భారీ కుంభకోణమే వెలుగు చూడవచ్చు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
రౌడీషీటర్ ఇంటిలో రూ. 50 కోట్ల పాతనోట్లు సీజ్! బ్లాక్ అండ్ వైట్!
ముందు రోజు అక్కడే ఉన్నాడు...
నాగరాజ్ గురువారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు. అయితే, పోలీసులు తలుపులు పగులగొడుతున్న సమయంలో టెర్రాస్పై నుంచి పక్కింటి గోడపైకి ఎక్కి పారిపోయాడు. ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు పెద్ద యెత్తున నోట్ల కట్టలు కనిపించాయి. దాదాపు 12 గంటల పాటు వారు సోదాలు చేశారు.
ఈ నెల 7వ తేదీన ఉమేష్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు నాగరాజ్ ఇంటిపై దాడి చేశారు. మార్చి 18వ తేదీన గణేష్, కిశోర్ అనే మిత్రులతో తాను స్థలం చూడడానికి వెళ్లామని, ఆ సమయంలో శరవన్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ ముగ్గురిని కారులో కిడ్నాప్ చేశారని ఉమేష్ ఫిర్యాదు చేశాడు. తమను నాగా ఇంటికి తీసుకుని వెళ్లారని చెప్పాడు. నాగాపై హత్య, బలవంతపు వసూళ్లు, అహహరణలు, మనీ లాండరింగ్ వంటి 45 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
నాగరాజ్కు ఆ పేరు అలా...
నాగరాజ్కు బాంబు నాగా అనే పేరు 1985లో వచ్చింది. తన వ్యాపారి ప్రత్యర్థి రాజేంద్రన్పై నాటు బాంబు విసరడంతో అతనికి ఆ పేరు వచ్చింది. ఆ సమయంలో శ్రీరామపుర పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను రాజేంద్రన్ను చంపాలని అనుకున్నట్లు, ఆ బాంబును తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుంచి తెచ్చుకున్నట్లు పోలీసు విచారణలో అతను చెప్పాడు. అయితే, రాజేంద్రన్ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆయనను మరో రౌడీ చక్రవర్తి అలియాస్ చక్రీ హత్య చేశాడు. తనను నాగా అలియాస్ బాంబు నాగా అలియాస్ పాల్ నాగా అని పోలీసులు పిలువగూడదని నాగరాజ్ హైకోర్టును ఆశ్రయించాడు.
జేబుల కత్తిరింపుతో ప్రారంభమై...
పిక్ ప్యాకెటింగ్ ద్వారా నాగారాజ్ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత హత్యలు, హత్యాప్రయత్నాలు, బలవంతపు వసూళ్లు వంటి పలు నేరాలకు పాల్పడ్డాడు. అతనిపై, అతని ముఠాపై మల్లేశ్వరం, శ్రీరామపుర పోలీసు స్టేషన్లలో రౌడీ షీట్ తెరిచారు. నేర ప్రపంచం నుంచి బయటపడడానికి అతను 2002లో బిబిఎంపి ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రకాష్నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేసి గెలిచాడు. అతను 2001, 2005 మధ్య కాలంలో కార్పోరేటర్గా ఉన్నాడు. కానీ అతను తన నేరప్రవృత్తిని వదులుకోలేదు.
నాగా ముఠా 2010లో బిబిఎంపి మాజీ కార్పోరేటర్ గోవిందరాజును నరికి చంపింది. నాగా భార్యల్లో ఒక్కరైన క్వీన్ ఎలిజబెత్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు అతన్ని నరికి చంపారు అతన్ని హత్య చేసేందుకు కిరాయి ముఠాకు రూ.1.5 లక్షలు ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు.