మోదీ చాణక్యం- ఆయనకు మాత్రమే సాధ్యం
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే ఉక్రెయిన్లో పర్యటించారు. రాజధాని కీవ్లో ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక- రక్షణ ఒప్పందాలపై చర్చించారు. సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో శాంతి చర్చలను ప్రతిపాదించారు. చర్చల వల్ల అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.
అదే సమయంలో ఉక్రెయిన్ బద్ధ శతృవు రష్యాతోనూ సత్సంబంధాలను కొనసాగించగలుగుతున్నారు ప్రధాని మోదీ. నిజానికి ఉక్రెయిన్ వెళ్లడానికి కొద్దిరోజుల ముందే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక్కడే ప్రధాని మోదీ తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. బద్ధ శతృవులను ఏకకాలంగా పలకరించగలిగారు. శాంతిచర్చల ప్రాధాన్యతను వివరించగలిగారు. ఈ రెండు దేశాలనూ సమన్వయం చేయగలిగారు. దౌత్యపరమైన శక్తియుక్తులను ప్రపంచ వేదికలపై ప్రదర్శించగలిగారాయన.
మోదీ చేపట్టిన ఉక్రెయిన్ పర్యటన.. ఆ దేశంతో భారత్కు ఉన్న సన్నిహిత సంబంధాలను పునరుజ్జీవింపజేయడం మాత్రమే కాకుండా, దాని శతృవైన రష్యా మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని కొనసాగించేలా చేయగలిగింది. ఒకే వేదికపై రష్యా- ఉక్రెయిన్తో భారత్ చారిత్రాత్మక సంబంధాలను కొనసాగించడం, ఈ కల్లోల సమయంలో శాంతి కాముకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు రేకెత్తించాయి.
సోవియట్ యూనియన్ కాలం నుంచే రష్యాతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. 1971లో ఇండో-సోవియట్ శాంతి ఒప్పందాలపై సంతకం చేసింది. స్నేహపూరక సంబంధాలు, పరస్పర సహకార ఒప్పందాలు.. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన సంబంధాలకు నిదర్శనం.
దశాబ్దాలుగా భారతదేశానికి సైనిక పరికరాలు, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తూ వస్తోంది రష్యా. దేశ రక్షణ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. ఈ రంగంలో కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఆవిర్భవించిన ఉక్రెయిన్తో సైతం భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి. రక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో ఉక్రెయిన్ కీలక భాగస్వామి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధకాలంలో ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగింపజేసుకోవడం పెను సవాల్. అమెరికా సహా అనేక దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి. ఉక్రెయిన్కు అండగా నిల్చోవాలంటూ భారత్పైనా ఒత్తిడి తెచ్చాయి. భారత్ మాత్రం శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇచ్చింది. తటస్థ వైఖరిని అవలంభించింది.
రష్యా- ఉక్రెయిన్తో ఏకకాలంలో సత్సంబంధాలను కొనసాగించింది మోదీ సర్కార్. రష్యాను ఒంటరిగా చేయాలంటూ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు ఏ మాత్రం తలొగ్గ లేదు. ఆయా దేశాలు చెప్పినట్లు చేయడానికి నిరాకరించింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి క్రూడాయిల్ను కొనుగోలు చేసింది.
తన ఉక్రెయిన్ పర్యటనతో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు మోదీ. శాంతి కోసం భారత్ ఎక్కడిదాకా అయినా వెళ్లగలుగుతుందనే సందేశాన్ని ఇవ్వగలిగారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడటంలో తన నిబద్ధతను చాటుకోగలిగారు. రష్యా- ఉక్రెయిన్లల్లో ఏ ఒక్కటి కూడా భారత్కు శతృవు కాదని నిరూపించగలిగారు. రెండు దేశాల్లోనూ మోదీకి ఇంతటి అపూర్వ ఆదరణ లభించడం అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోంది.
స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం మోదీ ఉక్రెయిన్ పర్యటనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. లోక్సభ ఎన్నికల సమయంలో పాపా నే వార్ రుక్వా దీ (పాపా యుద్ధాన్ని ఆపగలిగారు) అనే పదం మరోసారి తెరమీదికి వచ్చింది. మోదీ నిజంగా ప్రపంచ నాయకుడు, శాంతి కాముకుడు అంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు ఆయన మద్దతుదారులు.
మోదీ ఉక్రెయిన్ పర్యటనపై విమర్శలూ లేకపోలేదు. దీన్ని పీఆర్ స్టంట్గా అభివర్ణించిన వారూ ఉన్నారు. శాంతియుత వాతావరణన్ని నెలకొల్పడానికి భారత్ ఎలాంటి నిర్దుష్ట చర్యలు తీసుకుందంటూ విమర్శకులు ప్రశ్నిస్తోన్నారు.
విమర్శల మటెలా ఉన్నప్పటికీ- ఒక్కటి మాత్రం ఇక్కడ సుస్పష్టం. ప్రధాని మోదీ వేసిన దౌత్యపర వ్యూహాలను మరే దేశాధినేత వేయలేకపోయారు. కొన్ని వారాల వ్యవధిలో వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ కాగలిగారు. అది- ప్రపంచ శాంతి సృష్టికర్తగా భారత పాత్రనుమ మరింత బలోపేతం చేసిందనడంలో సందేహాలు అక్కర్లేదు.
రష్యా- ఉక్రెయిన్తో పరస్పర చర్చలు జరపడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలు, చర్చలు, శాంతియువ పరిస్థితులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత మున్ముందు భారత్ను ఈ వివాదంలో మధ్యవర్తిగా నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత్ అనుసరిస్తోన్న ఈ తటస్థ వైఖరి, నాన్ అలైన్మెంట్ పాలసీ.. మధ్యవర్తిగా వ్యవహరించడానికి అవసరమైన విశ్వసనీయతను అందించినట్టయింది.
ప్రస్తుతం- భౌగోళికంగా, రాజకీయంగా ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా తటస్థంగా వ్యవహరించడం, రెండు బద్ధ శతృవులైన దేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం కత్తి మీద సాములాంటిదే. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కొత్త శతృవులు పుట్టుకొస్తారు.
ఇలాంటి సమస్యాత్మక, సున్నిత అంశాల్లో ప్రధాని మోదీ అనుసరించిన దౌత్య, విదేశాంగ విధానాలు.. దేశ సార్వభౌమత్వాన్ని మరోసారి ప్రస్ఫూటింపజేయగలిగింది. తన జాతీయ ప్రయోజనాలను కొనసాగించడానికి కారణమైంది.
మోదీ చేపట్టిన ఉక్రెయిన్ పర్యటనపై దేశంలో విస్తృతంగా చర్చ సాగుతున్నప్పటికీ.. ప్రతిపక్షాలు- మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మోదీ అనుసరిస్తోన్న వ్యూహాత్మక విదేశాంగ, దౌత్య విధానాల చాణక్యానికి అద్దం పట్టినట్టయింది.












Click it and Unblock the Notifications