లాక్డౌన్ పొడగింపు: మోదీ థియరీ ఇదే.. 40 రోజుల తర్వాత కరోనా తీవ్రత ఇలా.. జూన్ 3 వరకు తప్పదేమో
అక్షరాలా 20 లక్షలు.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కాటుకు గురైనవాళ్ల సంఖ్య. అందులో 4.5లక్షల మంది కోలుకోగా, 1.2లక్షల మంది చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో 5.9లక్షల కేసులు, దాదాపు 24వేల మరణాల తర్వాతగానీ 'భయానక స్థితి'నుంచి బయటపడ్డామని అక్కడి పాలకులు చెప్పారు. అదే ఇండియాలో.. వైరస్ వ్యాప్తి ఇంకా 'పీక్'దశకు చేరనేలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాటికి మన దగ్గర వైరస్ బాధితుల సంఖ్య 10వేలు దాటింది. అందులో వెయ్యికిపైగా కోలుకోగా, మరణాల సంఖ్య 350కి దగ్గరైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ కొనసాగింపును అధికారికంగా ప్రకటించారు.
Recommended Video
40 రోజుల ఫార్ములా..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 21 రోజులా పాటు విధించిన తొలి దశ లాక్ డౌన్ మంగళవారంతో పూర్తవుతుంది. దాన్ని మరో 19 రోజులపాటు(మే 3 వరకు).. అంటే, మొత్తం 40 రోజులకు పొడగిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇందుకోసం ఆయన కేంబ్రిడ్జి అధ్యయనాన్ని పోలిన థియరీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. వైరస్ కట్టడి విషయంలో ఇతర దేశాల్లోని దుస్థితితో పోల్చుకుంటే, మనం అనుసరిస్తున్న మార్గం సరైందేనని మోదీ అన్నారు. రెండో దశ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉండాలనేదానిపై సుదీర్ఘ చర్చల అనంతరం 21-19 సూత్రానికే ఆయన మొగ్గుచూపారు. అసలు..
21 రోజుల్లో ఏం జరిగిందంటే..
మన దేశంలో మార్చి 25 నుంచి తొలి దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగారు. తద్వారా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి)ని నిరోధించగలిగారు. ఇప్పటిదాకా బయటపడినవన్నీ కాంటాక్ట్ కేసులే కావడమే అందుకు నిదర్శనం. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 21 రోజులు సరిపోతుంది. కానీ, కరోనా మళ్లీ వ్యాప్తి చెందకుండా వుండేందుకు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ గడువు సరిపోదని, 21 రోజుల తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే పెనుప్రమాదం తప్పదని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనకారులు చెప్పారు. ఆమేరకు..
వైరస్ మళ్లీ రావొద్దనే..
లాక్ డౌన్ కు ముందు, ఆ తర్వాత కేసుల సంఖ్యలో పెరుగుదల, క్వారంటైనీల సంఖ్యను బట్టి కేంబ్రిడ్జి వర్సిటీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఇద్దరు రీసెర్చర్లు ఆర్. అధికారి, రాజేశ్ సింగ్ లు ఒక స్టడీ చేపట్టారు. వైరస్ నియంత్రణకు వాళ్లు నాలుగు రకాల ప్రొటోకాల్స్ రూపొందించారు. మొదటిది 21రోజులకే ముగించడం, రెండోది (మధ్యలో ఐదు రోజుల గ్యాప్ తో) 21-28, మూడోది 21-28-18, ఇక నాలుగో ఆప్షన్ ఏకబిగిన 49 రోజుల లాక్ డౌన్. కేంబ్రిడ్జి సూచించిన మూడు, నాలుగో ఆప్షన్లకు మధ్యస్థంగా మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువులోపల స్పష్టమైన కాంటాక్ట్ ట్రేసింగ్, పకడ్బందీగా క్వారంటైన్ అమలు చేస్తే వైరస్ తిరిగి రావడాన్ని(వైరస్ పునరుజ్జీవనం) దాదాపు నిరోధించొచ్చు. గ్రాఫ్ లో కరోనా కర్వ్ దాదాపు జీరోను చేరుకునే ఆస్కారముంది. కానీ..
20 తర్వాతే టెన్షన్..
మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, అందునా ఇది కోతల సీజన్ కాబట్టి ఈనెల 20 నుంచి ఆయా రంగాలకు లాక్ డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నిపుణుల సూచనల మేరకే ఈ సడలింపులు కల్పిస్తున్నామని, ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మినహాయింపులు ఉపసంహరిస్తామని ఆయన హెచ్చరించారు. మనం పైన చెప్పుకున్న థియరీలన్నీ సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ పక్కాగా అమలైన సందర్భానికి సంబంధించినవే. కానీ ఈనెల 20 నుంచి కొన్ని రంగాలు మళ్లీ యాక్టివ్ కానుండటంతో టెన్షన్ మరింత పెరుగుతుంది. మళ్లీ వైరస్ వ్యాప్తికి అవకాశం ఏర్పడుతుంది. అలా జరగొద్దనే కేంద్రం లాక్ డౌన్-2 కోసం పక్కా నిబంధనల్ని రూపొందించింది. ఆ రూల్స్ ఏంటనేవి కేంద్ర హోం శాఖ బుధవారం వెల్లడించనుంది. పొరపాటున వైరస్ మళ్లీ వ్యాప్తి చెందినట్లు గుర్తిస్తే ఈసారి 28 రోజులపాటు, అంటే, దాదాపు జూన్ 3 వరకు లాక్ డౌన్ పొడగించే అవకాశాలున్నాయి.