ఏప్రిల్ 14 తర్వాత స్కూళ్ల సంగతేంటి.. లాక్ డౌన్తో విద్యా వ్యవస్థలో ఓ కీలక మలుపు..?
కరోనా లాక్ డౌన్పై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ.. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరాన్ని యథావిధిగా కొనసాగిస్తారా.. పరీక్షలు నిర్వహిస్తారా..? అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ సందేహాలకు తెరదించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన జాతీయ మీడియాతో వెల్లడించారు. ఏప్రిల్ 14 తర్వాత విద్యా సంస్థల విధి విధానాలకు సంబంధించిన నిర్ణయాలను వీడియో కాన్ఫరెన్స్లో చర్చిస్తామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా విద్యా సంవత్సరాన్ని కొనసాగించడమా లేక స్కూళ్లకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించడమా అన్నది చర్చిస్తామన్నారు.

ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టనున్న ఢిల్లీ ప్రభుత్వం
మరోవైపు సీబీఎస్ఈ అనుబంధ విద్యా సంస్థలు ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం మినహాయించి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు బోధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఖాన్ అకాడమీ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇప్పటికే విద్యార్థులకు ల్యాప్ టాప్ వంటి ఉచిత ఈ-లెర్నింగ్ మెటీరియల్స్ అందించేందుకు ముందుకొచ్చింది. వాటి ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా మ్యాథ్స్,సైన్స్ సబ్జెక్టులు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంవత్సరంపై లాక్ డౌన్ ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.

లాక్ డౌన్తో విద్యా వ్యవస్థ కీలక మలుపు
లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడి.. హాస్టల్ విద్యార్థులు కూడా స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో పెద్ద నోట్ల రద్దు డిజిటల్ లావాదేవీలకు ఎలాగైతే అవకాశం కల్పించిందో.. ఇప్పుడీ లాక్ డౌన్ ఈ-లెర్నింగ్కు అవకాశం కల్పిస్తోంది. చాలావరకు విద్యా సంస్థలు ఆన్లైన్లో క్లాసులు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలు ఐఐటీ ఢిల్లీ,జేఎన్యూ,ఢిల్లీ యూనివర్సిటీ,జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ,నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే ఆన్లైన్లో సబ్జెక్టులను బోధిస్తున్నాయి.

డీటీహెచ్ నెట్వర్క్స్లోనూ ఆన్లైన్ క్లాసులు..
లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడటంతో.. స్కూల్ విద్యార్థుల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ పలు ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ చానెల్ స్వయం ప్రభ ద్వారా టాటా స్కై,ఎయిర్టెల్ టీవీ వంటి డీటీహెచ్ నెట్వర్క్స్లో స్కూల్ సిలబస్ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఇందులో రికార్డెడ్ లెసన్స్తో పాటు లైవ్ సెషన్స్ కూడా ఉంటాయని పేర్కొంది.లైవ్ సెషన్స్లో విద్యార్థులు హెల్ప్ లైన్ ద్వారా ప్రశ్నలు అడిగేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపింది. కాబట్టి విద్యార్థులు వాటిని ఉపయోగించుకుని ఇంటి వద్దే చదువుకోవాలని విజ్ఞప్తి చేసింది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు,వివిధ విద్యా సంస్థల బోర్డులకు దీనికి సంబంధించిన సర్క్యులర్ పంపించినట్టు వెల్లడించింది.
Recommended Video
భారత్ పడే క్యాంపెయిన్..
ఈ సంక్లిష్ట సమయంలో దేశంలో ఆన్లైన్ లెర్నింగ్ను మరింత పటిష్టం చేయడం కోసం ప్రజల నుంచి కూడా ప్రభుత్వం సలహాలు,సూచనలు కోరుతోంది. ఇందుకోసం 'భారత్ పడే ఆన్లైన్' క్యాంపెయిన్ను కూడా మొదలుపెట్టింది. ప్రజలు మెయిల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా తమ సలహాలు,సూచనలు పంపించవచ్చునని తెలిపింది.












Click it and Unblock the Notifications