Hemanth Soren : హేమంత్ సోరెన్ కు భారీ ఊరట-మనీలాండరింగ్ కేసు చెల్లదన్న సుప్రీంకోర్టు..
జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు ఇవాళ భారీ ఊరటనిచ్చింది. ఆయనపై జార్ఖండ్ హైకోర్టులో దాఖలైన పలు ప్రజాప్రయోజన వాజ్యాలకు విచారణార్హత ఉందని గతంలో ఇచ్చిన ఆదేశాలు చెల్లవని ప్రకటించింది. అలాగే ఆయనపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ చెల్లదని పేర్కొంది.
జార్ఖండ్ లో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తనకు తానుగా ఓ బొగ్గు గని కేటాయించుకున్న వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద విచారణ చేయాలని ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలు కావడం, వీటిని ఈడీ నిర్ధారించడంతో ఆయన్ను సీఎంగా తొలగించాలని బీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. ఓ దశలో సోరెన్ ను తొలగించేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, గవర్నర్ ఉత్తర్వులు జారీ చేయడం తరువాయి అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో సోరెన్ తమ పార్టీ జేఎంఎంకు మద్దతిస్తున్న కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలతో భేటీ అయి పరిస్ధితిని సమీక్షించారు.
అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై దాఖలైన పిటిషన్లకు విచారణార్హత ఉందంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఇందులో సోరెన్ సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు చెల్లవని ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జార్ఖండ్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విచారణను నిలిపేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో సోరెన్ కు భారీ ఊరట దక్కినట్లయింది. అలాగే సోరెన్ పై అనర్హత వేటుకు సంబంధించి జరిగిన ప్రచారానికి సైతం ఫుల్ స్టాప్ పడినట్లయింది.