ముంబైలో మళ్లీ కోవిడ్ కల్లోలం-భారీగా కేసుల వ్యాప్తి హెచ్చరికలు-6 శాతానికి పాజిటివిటీ రేటు
దేశ పారిశ్రామిక రాజధాని నగరం ముంబైలో మరోసారి కోవిడ్ కేసులు కల్లోలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో మంబై నగరం అల్లాడుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది. మరోవైపు పెరుగుతున్న పాజిటివిటీ రేటు కూడా అధికారుల్ని ఆందోళన కలిగిస్తోంది.
ముంబై నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఆరు శాతానికి చేరుకోవడంతో కోవిడ్ పరీక్షల్ని వేగవంతం చేయనున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఇవాళ ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన పరీక్షలను వెంటనే పెంచాలని అధికారులను కోరింది. టెస్టింగ్ ల్యాబ్లు కూడా చురుగ్గా, పూర్తి సిబ్బందితో ఉండాలని ఆదేశించింది. ముంబైలో రోజువారీ కొత్త కేసులు విపరీతంగా పెరిగాయి. రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రోగ లక్షణాలు ఉన్న కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
బీఎంసీ 12-18 సంవత్సరాల కేటగిరీలో వ్యాక్సినేషన్ డ్రైవ్, బూస్టర్ డోస్లను తక్షణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. రోగలక్షణ కేసుల్లో మరో తీవ్ర పెరుగుదల భయంతో బీఎంసీ.. జంబో ఫీల్డ్ ఆసుపత్రులను తగినంత సిబ్బందితో అప్రమత్తంగా ఉంచాలని కోరింది. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. వార్డు వార్రూమ్లలో సిబ్బంది, వైద్య బృందాలు, అంబులెన్స్లు సన్నద్ధంగా ఉన్నాయో లేదా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. రానున్న రోజుల్లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగితే, మలాద్లోని జంబో ఆసుపత్రిని ప్రాధాన్యతపై ఉపయోగించాలని తెలిపింది.