భయం గుప్పెట్లో చెన్నై: వణికిస్తోన్న వర్షాలు, భారీగా ట్రాఫిక్ జామ్
గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కుండపోతగా కురుస్తోన్న వర్షం ధాటికి చెన్నై పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
చెన్నై : కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చివురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా జలమయమే కావడంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గురువారం కూడా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి కుండపోతగా కురుస్తోన్న వర్షం ధాటికి చెన్నై పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించేందుకు నానా యాతన పడ్డారు. దాదాపు చెన్నై శివారులోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు భారీ వర్షాలుగా మారడంతో చెన్నై నగరానికి వరద బెడద తప్పలేదు.
ఈ నెల 5వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని వాతావరణ శాఖ చెబుతుండటంతో.. చెన్నై వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల ధాటికి రోడ్ల మీదకు వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు.
కాంచీపురం, తిరువళ్లూరు నాగపట్నం, తిరువారూరు, కడలూరు, తంజావూరు, రామనాథపురం, పుదుకోట్టై ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. వర్షాల ప్రభావంతో వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు ఐదుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం.