24 ఏళ్ల తర్వాత ఆ ఆస్పత్రి లిఫ్ట్ తెరవగా... ఆ దృశ్యానికి అంతా షాక్... మిస్టరీగా మారిన ఘటన
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. 24 ఏళ్లుగా వినియోగంలో లేని ఓ ఆస్పత్రి లిఫ్టులో మనిషి అస్తిపంజరం బయటపడింది. లిఫ్టుకు మరమ్మత్తులు చేసేందుకు దాన్ని తెరవగా అందులో అస్తిపంజరం గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బస్తీ జిల్లాలోని కైలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కైలీలో 1991లో 500 పడకలతో ఒపెక్ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇందులో ఉన్న లిఫ్ట్ 1997 వరకు పనిచేసింది. ఆ తర్వాత సాంకేతిక సమస్యలతో అది మూతపడింది. అప్పటినుంచి అది వినియోగంలో లేదు. ఇటీవల ఆస్పత్రి యాజమాన్యం దాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్ 1న టెక్నీషియన్లను పిలిపించింది. వారు లిఫ్టు రిపేర్ కోసం దాని తలుపులు తెరవగా... అందులో మనిషి అస్తిపంజరం బయటపడింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని లిఫ్టులోని అస్తిపంజరాన్ని పరిశీలించారు. డీఎన్ఏ టెస్టు కోసం దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ అస్తిపంజరం ఎవరిదనే మిస్టరీ ఇప్పుడు వెంటాడుతోంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించేందుకు 24 ఏళ్ల క్రితం నాటి మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
లిఫ్ట్ 24 ఏళ్లుగా మూతపడి ఉంటే... అందులోకి మనిషి ఎలా వెళ్లాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో ఆ వ్యక్తి అందులో ఉన్నారా... లేక ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ లిఫ్టు ఆగిపోయిన సమయంలో అందులో వ్యక్తి ఉండి ఉంటే... ఆస్పత్రి యాజమాన్యం అతన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైతే ఆ అస్తిపంజరం ఎవరిదనేది మిస్టరీగా ఉంది. డీఎన్ఏ రిపోర్ట్ వచ్చాక కొంత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని బస్తీ ఏఎస్పీ దీపేంద్రనాథ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నారు. జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం పనిచేస్తున్నారని తెలిపారు.
కలవరపెడుతున్న హత్యలు :
Recommended Video
ఐదు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో 24 గంటల వ్యవధిలో 13 హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ప్రయాగ్రాజ్,లలిత్పూర్,హర్దోయ్,బరాబంకి,ఆగ్రా,కాస్గంజ్,మెయిన్పురి ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాస్గంజ్లోని అలీగంజ్ ప్రాంతంలో బీజేపీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి వర్గం ఆయన్ను హత్య చేసింది.ఈ హత్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించారు. యోగి సర్కార్లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు,అత్యాచారాలు కామన్గా మారిపోయాయని మండిపడ్డారు.