గుండె తరుక్కుపోయే దృశ్యం.. ఆకలి తట్టుకోలేక రోడ్డుపై కుక్క మాంసం తింటూ..
'ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి..' అంటాడు ఓ సినీ కవి. 1981లో విడుదలైన ఆకలి రాజ్యం సినిమాలోని ఈ డైలాగ్ ఇప్పటి పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు. కరోనా లాక్ డౌన్ వేళ.. వేల మైళ్లు కాలినడకనే సాగుతున్న వలస కూలీల చిద్ర జీవితాలకు పట్టెడు అన్నం దొరకని ధీన స్థితి. అక్కడో.. ఇక్కడో.. ఎవరైనా మానవతావాదులు దయతలిస్తే తినడం.. లేదంటే ఎండిన డొక్కలతోనే ఎనుదిరగకుండా సాగిపోవడం.. కానీ ఆకలి నిలబడనిస్తుందా.. ఆఖరికి రోడ్డుపై చనిపోయిన శునకం కళేబరాన్నైనా తినమని ఎగదోస్తుంది.. రాజస్తాన్లోని జైపూర్లో తాజాగా ఇదే ఘటన చోటు చేసుకుంది.

రోడ్డుపై చనిపోయిన కుక్క కళేబరాన్ని తింటూ..
ఢిల్లీ-జైపూర్ హైవేపై మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి రోడ్డుపై చనిపోయిన కుక్క కళేబరాన్ని తింటుండటం అటుగా వెళ్తున్నవారికి కనిపించింది. అందులో ప్రధుమాన్ సింగ్ నరుక అనే వ్యక్తి కారును పక్కకు ఆపి.. అతనితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. ఆకలిని తట్టుకోలేక కుక్క మాంసం తింటున్నానని చెప్పడంతో షాక్ తిన్నారు. ఆపై అప్పటికిప్పుడు అతనికి వేరే చోటు నుంచి ఆహారం తీసుకొచ్చి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సాయం చేసిన వ్యక్తి ఏమంటున్నాడు..
నరుక ఓ లంచ్ బాక్సులో ఆహారం తీసుకొచ్చి ఇవ్వగానే అతను ఆత్రుతగా తినడం వీడియోలో కనిపించింది. దీనిపై నరుక మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి కారులో వెళ్తుండగా.. రోడ్డుపై అతను చనిపోయిన శునకాన్ని తినడం చూశాను. దీంతో అతని ఆకలి తీర్చేందుకు ఫుడ్,వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాను. కొంత డబ్బు సాయం చేశాను. ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతనికి సాయమందిస్తే బాగుంటుంది.' అని పేర్కొన్నాడు. చాలామంది అతన్ని చూసి వెళ్లిపోయారే తప్పితే.. ఎవరూ సాయమందించేందుకు ముందుకు రాకపోవడం విచారకరమన్నాడు. ఈ ఘటనకు మానవత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
Recommended Video

ప్రభుత్వంపై విమర్శలు..
ట్విట్టర్లో ఈ వీడియోపై స్పందించిన చాలామంది నెటిజెన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ ముందు చూపులేని కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించట్లేదని చెప్పిన పీయూష్ గోయల్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే బాగుంటుందని మండిపడ్డారు. ఓవైపు లాక్ డౌన్ వేళ ఇలా వలస కూలీలు తిండి దొరక్క అల్లాడుతుంటే.. మరికొన్నిచోట్ల క్వారెంటైన్ కేంద్రాల్లో దళితులు వండిన ఆహారాన్ని తినమని నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. గత నెలలో ఉత్తర్ప్రదేశ్లోని ఖుషీనగర్లో ఇలాంటి ఘటనే జరగ్గా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications