భార్యతో బలవంతపు సెక్స్ చట్టవిరుద్దమా కాదా... ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఏం తేల్చిందంటే...
భార్య ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆమెతో శృంగారం చేయడం చట్టవిరుద్దంగా పరిగణించలేమని ముంబై కోర్టు పేర్కొంది. ఒక భర్తగా అతను ఆ చర్యకు పాల్పడటాన్ని చట్టవిరుద్దమనలేమని స్పష్టం చేసింది. తన ఇష్టంతో సంబంధం లేకుండా భర్త జరిపిన బలవంతపు శృంగారం తనను పక్షవాతం బారినపడేలా చేసిందని ఆరోపిస్తూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్పై ముంబై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె పక్షవాతం బారినపడటం దురదృష్టకరమని.. అయితే అందుకు ఆమె భర్తను బాధ్యుడిని చేయలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
భార్యతో భర్త బలవంతపు శృంగారం: కేంద్రం వాదన సబబేనా?, జైలుకే అంటున్న సుష్మా భర్త
అసలేంటీ కేసు...
ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం... కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహం జరిగింది. అయితే వివాహానంతరం తన భర్త,అతని కుటుంబం తనపై ఆంక్షలు పెట్టారని, అవహేళన చేశారని, హింసించారని,డబ్బు కూడా డిమాండ్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన నెల రోజులకు తన ఇష్టానికి విరుద్ధంగా భర్త తనతో శృంగారం జరిపాడని ఆరోపించింది.
బలవంతపు శృంగారం... భార్యకు పక్షవాతం...
ఈ ఏడాది జనవరి 2న ఆ జంట ముంబైలో సమీపంలోని మహబళేశ్వరంలో గడిపేందుకు వెళ్లారు. అక్కడ కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా భర్త బలవంతంగా శృంగారం చేశాడు. ఆ తర్వాత నుంచి తన ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ను సంప్రదిస్తే ఆమె నడుము కింది భాగానికి పక్షవాతం వచ్చినట్లు తేల్చారు. ఆ విషయం తెలిశాక భర్త,అత్తింటివారిపై ఆమె కేసు పెట్టింది.
దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె భర్త,అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.దురద్దేశపూర్వకంగా తమను ఈ కేసులో ఇరికించారని ఆమె భర్త,అతని కుటుంబ సభ్యులు కోర్టుకు విన్నవించారు. ఆమెను ఏనాడు తాము వరకట్నం కోసం డిమాండ్ చేయలేదని,వేధించలేదని తెలిపారు. తాము ఉండేది రత్నగిరిలో అని... ఎప్పుడో ఒకసారి వచ్చి రెండు రోజుల పాటు వారితో ఉండి వెళ్తామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఓ మహిళ మాట్లాడుతూ... తాను గర్భంతో ఉన్న సమయంలో వారి వద్దకు వెళ్లినట్లు చెప్పారు.
కోర్టు ఏం చెప్పింది...
వారి వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించింది. అదే సమయంలో పిటిషన్ దాఖలు చేసిన మహిళకు ఓ ప్రశ్న వేసింది. వరకట్నం డిమాండ్ చేశారని చెప్పారు గానీ ఎంతనేది ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది.వరకట్న వేధింపుల విషయాన్ని పక్కనపెడితే... భార్యతో భర్త బలవంతపు శృంగారం చట్టపరిధిలో నిలబడే అంశం కాదని కోర్టు పేర్కొంది.
ఆమెకు పక్షవాతం రావడం దురదృష్టకరం.అయితే దీనికి ఆమె భర్త,అతని కుటుంబం బాధ్యులు కారు. ఆమె చేసిన ఆరోపణలను బట్టి చూస్తే... ఈ కేసులో కస్టడీ విచారణ అవసరం లేదు. విచారణకు సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.' అని కోర్టు పేర్కొంది.
గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పేంటి...
భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదు.. భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని గతంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహంతో పని లేకుండా శృంగారానికి సమ్మతించే వయసును 18 ఏళ్లు గా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్గానే పరిగణించాలని ఇండిపెండెంట్ థాట్ అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లో రెండో క్లాజు ప్రకారం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందికి రాదు. దీన్ని ఇండిపెండెంట్ థాట్ సవాలు చేసింది.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 15ఏళ్లలోపు అమ్మాయిలతో సమ్మతితో శృంగారంలో పాల్గొన్నా.. అది రేప్ కిందకే వస్తుందని, 15-18 ఏళ్లలోపు వివాహితల సమ్మతితో వారి వారి భర్తలు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందికి రాదని స్పష్టం చేసింది.
గతంలో కేంద్రం కూడా పిటిషన్...
భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలనే డిమాండుపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని ఎందుకు నేరంగా పరిణగించకూడదో అందులో వివరించింది.
భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తే.. భారతీయ వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని పేర్కొంది. దీన్ని అడ్డుపెట్టుకుని భార్యలు భర్తలపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని, వేధింపులకు దాన్నో ఆయుధంగా వాడుకుంటారని చెప్పుకొచ్చింది.భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణిస్తే.. ఐపీసీ సెక్షన్ 498(ఏ) లాగే అది కూడా దుర్వినియోగం అవుతుందని కేంద్రం అందులో తెలిపింది.
సుష్మా స్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు
వైవాహిక అత్యాచారంపై మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో వైవాహిక అత్యాచారం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తలంతా ఇళ్లలో ఉండరని, జైళ్లలోనే ఎక్కువమంది ఉంటారని స్వరాజ్ కౌశల్ అభిప్రాయపడ్డారు. ఇళ్లు జైళ్లను తలపించకూడదని అన్నారు.
మహిళా లోకం సంధిస్తున్న ప్రశ్న...
భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త ఆమెతో బలవంతపు శృంగారం చేయడమనేది ఎంతవరకు సబబు అనేది మహిళల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. ఒకవిధంగా న్యాయస్థానాలను కూడా పురుషాధిపత్యకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విమర్శ దీనిపై ఉంది. స్త్రీ స్వేచ్చకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ప్రభుత్వం దీనిపై కఠిన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయంగానే కనిపిస్తోంది.