మిత్రుడితో భార్యపై అత్యాచారం: భర్తకు పదేళ్ల జైలు శిక్ష
బాధితురాలు సంఘటనను తెలియజేయడానికి వెనకాడినందున అత్యాచారం వంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరగడం సహజమని న్యాయమూర్తి వాదించారు. ప్రత్యేకంగా అత్యాచారం లేదా మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి సంఘటనల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరడం మామూలేనని న్యాయమూర్తి అన్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితురాలు లేదా వారి సంబంధీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని, అందువల్ల జాప్యం జరుగుతుందని అన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పలు కోణాల్లో ఆలోచనలు చేస్తారని, భారత్ వంటి సంప్రదాయాలకు కట్టుబడే దేశంలో ఆ అంశంపై కేసును కొట్టివేయడం కుదరదని అన్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని యావత్తూ పరిశీలిస్తే నిందితుడు నేర రచనలో పాల్గొన్నాడని అర్థమవుతుందని, ఆమె వాంగ్మూలం నమ్మదగిందిగా ఉందని న్యాయమూర్తి అన్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు, ఆమెను కొట్టినట్లు కూడా వైద్య పరీక్షలు తెలియజేస్తున్నాయని అన్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - తన పదహారేళ్ల కూతురు కనిపించడం లేదని 2011 ఏప్రిల్ 21వ తేదీన బాధితురాలి తండ్రి నారేలా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలికను, ఇద్దరు నిందితులను రైల్వే స్టేషన్ వద్ద పట్టుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
పెళ్లి చేసుకోవడానికి యువకుడితో తాను స్వచ్ఛందంగా వెళ్లిపోయానని బాలిక చెప్పింది. తన భర్త తనను అతని మిత్రుడి ఇంటికి పంపుతుండేవాడని, అక్కడ తనను నిర్బంధించి తనపై అత్యాచారం చేసి, కొట్టేవాడని ఆమె ఆరోపించింది. ఓ రోజు తాను అక్కడి నుంచి తప్పించుకుని తన బంధువుకి ఫోన్ చేశానని, ఆ బంధువు తన తండ్రికీ పోలీసులకూ సమాచారం ఇచ్చారని ఆమె వివరించింది.