హైదరాబాద్ ఫండ్ కేసు: భారత్కు చుక్కెదురు, పాక్కే రూ. 350కోట్లు?
లండన్: ఏడవ నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్కు చెందిన హైదరాబాద్ ఫండ్ కేసులో భారత్కు చుక్కెదురైంది. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కాకముందు పాకిస్థాన్కు తరలిపోయిన 35మిలియన్ పౌండ్లు(సుమారు రూ.350కోట్లు) భారత్కే చెందుతాయని భారత్ వాదించింది. అంతేగాక, ఆ నిధులపై పాకిస్థాన్కు ఎలాంటి అధికారమూ లేదన్నది భారత్ వాదన.
అయితే యూకే కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి విచారణ అనివార్యమైంది. పాకిస్థాన్కు అధికారం ఉందన్న దిశగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ కేసు విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి 75 పేజీల తీర్పును న్యాయమూర్తి హెండర్సన్ జె. వెలువరించారు.
'ఆ నిధులపై పాకిస్థాన్కు హక్కు ఉందని నిరూపించే ఆధారాలు ఉన్నాయి. వాదనలు కూడా పాకిస్థాన్కు అనుకూలంగా ఉన్నాయి. అవి లేవని, పాకిస్థాన్ ఎలాంటి ఆధారాలు లేకుండా హక్కులు కోరుతోందని నిరూపించే వాదన కానీ, సాక్ష్యాలు కానీ, భారత్ న్యాయస్థానం ముందు ఉంచలేకపోయింది' అని ఇంగ్లీష్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా, పాక్ హైకమిషనర్ పేరు మీదగల ఖాతాలో 1948 నుంచి పడివున్న మూడున్నర కోట్ల పౌండ్ల నిధులపై పాక్కు హక్కు లేదని రుజువులు చూపడంలో ఇం డియా విఫలమైందని పాకిస్థాన్ విదేశాంగశాఖ ఇస్లామాబాద్లో ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ జరుగుతుండగా నిధులు ఎవరికి చెందాలనే విషయంలో ఒక నిర్ధారణకు రావడం సరికాదని భారత విదేశాంగశాఖ కూడా మరో ప్రకటన విడుదల చేసింది.
నిజాం రాజు పాకిస్థాన్కు సాయంగా ఇవ్వదల్చుకున్న నిధులే ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. 1948 సెప్టెంబర్ 18న నిజాంరాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆ తర్వాత రెండు రోజులకు నిజాం ఏజెంటు ఆ నిధులను లండన్లోని పాక్ హైకమిషనర్ రహింతూలా పేరు మీదగల ఖాతాలోకి బదిలీ చేశారు. తన అనుమతి లేకుండానే నిధుల తరలింపు జరిగిందని అంటూ 1948 సెప్టెంబర్ 27న నిజాం రాజు బ్యాంకుకు లేఖ రాశారు.
అయితే ఖాతాదారు అనుమతి లేకుండా నిధులు వెనుకకు మళ్లించడం కుదరదని బ్యాంకు తెలిపింది. దాంతో నిధులు ఖాతాలో ఆగిపోయాయి. వాటి కోసం భారత్, పాకిస్థాన్లు న్యాయపోరాటం సాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications