దేశంలోనే పన్ను ఎగవేతదారుల్లో హైదరాబాద్ టాప్: ఎగవేత ఎంతంటే?
హైదరాబాద్ నగరం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతదార్లు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉండటమే ఇందుకు కారణం.
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతదార్లు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో ఎగవేతదార్ల సంఖ్య 25. ఆ తర్వాత రెండో స్థానంలో అహ్మదాబాద్(20మంది పన్ను ఎగవేతదారులతో) ఉంది.
రూ.3,614కోట్ల ఎగవేత.. బ్యాంక్ ఖాతాలు మాత్రం ఖాళీ
దేశవ్యాప్తంగా మొత్తం 96 మంది పన్ను ఎగవేతదార్లు ఉండటం గమనార్హం. 1980 నుంచి పన్ను కట్టకుండా వీరు కూడబెట్టిన సొమ్ము రూ.3,614.14 కోట్లు. వీరి నుంచి ఐటీ అధికారులు ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయారు. కొన్ని కేసులకు సంబంధించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేకపోగా, మరికొన్ని కేసుల్లో కొందరు తమ బ్యాంకు ఖాతాలను ఖాళీగా చూపుతున్నారు.
ముంబై వ్యాపారి 779కోట్లు ఎగవేత ఇలా..
ముంబైకి చెందిన ఉదయ్ ఆచార్య అనే వ్యక్తి ఐటీ శాఖకు రూ.779.04కోట్ల పన్ను కట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు అతను చనిపోయాడు. దీంతో అధికారులు పన్ను సేకరించడానికి ఉదయ్ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. అతని బ్యాంక్ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిసింది. దీంతో అధికారులది దిక్కుతోచని పరిస్థితిగా మారింది. ఈ క్రమంలో ఉదయ్ తోపాటు అతని కుమారుడ్ని కూడా పన్నుఎగువేతదారుల జాబితాలో చేర్చారు అధికారులు.
తొలుతగా నోటీసులు..
కాగా, 1961 ఆదాయ పన్ను చట్టం కింద ఐటీ శాఖకు సెక్షన్ 222, 227, 229, 232 కింద మిగిలిపోయిన పన్ను రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
దీని గురించి ఐటీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే.. ‘ఓ వ్యక్తి కానీకంపెనీ కానీ పన్ను కట్టలేదని తెలిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. తొలుత ఆ వ్యక్తికి కానీ కంపెనీకి కానీ చెందిన చిరునామాకు నోటీసులు పంపుతాం' అని వెల్లడించారు.
ఆ తర్వాతే ఎగవేతదారులుగా ప్రకటన
‘అప్పటికీ సమాధానం రాకపోతే అధికారులను పంపిస్తాం. ఏంచేసినా వారి నుంచి పన్ను సేకరించలేకపోతే ఎగవేతదారుల జాబితాలో వారివివరాలు జతచేస్తాం. దీని ద్వారా ఎగవేతదారులకు చెందిన ఆస్తుల వివరాలు తెలిస్తే బలవంతంగా సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉదయ్ లాంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా 69 మంది ఉన్నారు. అందులో 24 మంది బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి' అని అధికారులు వివరించారు.
హైదరాబాద్-ముంబై పోటాపోటీ..
హైదరాబాద్ పన్నుఎగవేతదారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ముంబై, నేవీ ముంబై ప్రాంతంలో చెల్లించాల్సిన టాక్స్ మొత్తం వారికంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో రూ.1,062.89కోట్ల పన్నులు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే పన్ను ఎగవేతదారులైన ఆ 25మంది నుంచి రూ.1028.67కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది.