పిలవకుండే నేనెందుకు వెళ్తా, అలవాటు లేదు: మాల్యా
లండన్: పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఉందని, పిలిస్తేనే తాను వెళ్లానని, పిలవకుంటే వెళ్లాల్సిన అవసరం తనకు ఏమిటని లిక్కర్ కింగ్, బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా అన్నాడు.
తన జీవితంలో నేను ఎప్పుడూ ఆహ్వానించని కార్యక్రమానికి వెళ్లనే లేదని చెప్పాడు. పిలవకుండా వెళ్లే అలవాటు తనకు లేదన్నాడు. తాను తన స్నేహితుడితో పాటు అక్కడికి వెళ్లానని, తన కుమార్తెతో కలిసి కూర్చున్నానని చెప్పాడు.
తన పైన వస్తున్న ఆరోపణలకు (రుణం ఎగవేత) ఎటువంటి ఆధారాలు లేవన్నాడు. ఛార్జీషీట్ కూడా లేదని, ఈ విషయమై తనను ఎందుకు తక్కువ చేసి చూపించుకోవాలని, ఇది అన్యాయం అన్నాడు.
వివాదం: లండన్లో భారత్ రాయబారి హాజరైన కార్యక్రమంలో మాల్యా
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకుల సీట్లలో విజయ్ మాల్యా కూర్చున్న విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమంలో భారత హై కమిషనర్ నవతేజ్ పాల్గొన్నారు. దీంతో ఇది వివాదం అయింది.
ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారి జాబితాలో మాల్యా పేరు లేదని నిర్వాహకులు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చామని, అంతేకాని ఎవరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు.