నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపు
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో యావత్ దేశాన్ని ఏకం చేసిన మోదీకి మరో రూపంలో ధన్యవాదాలు తెలపాలని కొంతమంది నెటిజెన్స్ భావించారు. ఇందుకోసం ఐదు నిమిషాల పాటు లేచి నిలబడి ప్రధానికి ధన్యవాదాలు తెలిపేలా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ విషయం ప్రధాని దృష్టికి రావడంతో ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఆ క్యాంపెయిన్ వద్దన్న మోదీ
'నాకు ధన్యవాదాలు తెలిపేందుకు కొంతమంది సోషల్ మీడియాలో స్టాండింగ్ ఒవేషన్(లేచి నిలబడటం) క్యాంపెయిన్ మొదలుపెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. నాకైతే ఇది మోదీని వివాదంలోకి లాగడం కోసమే అన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజాయితీగా చేసే ప్రయత్నమే అయినప్పటికీ.. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. దానికి బదులు పేదలకు సహాయం చేయండి.' అని మోదీ సూచించారు.

పేదలను ఆదుకోవాలని పిలుపు
'ఇది మీరు సదుద్దేశంతో చేపట్టాలనుకున్న కార్యక్రమే అయినప్పటికీ.. నాపై మీకు నిజంగా ప్రేమ,గౌరవం ఉంటే.. కనీసం ఈ కరోనా సంక్షోభ కాలం ముగిసేంతవరకు దేశంలోని పేదల బాధ్యతను తీసుకోండి. వారికి ఆహారం అందించే కార్యక్రమాలు చేపట్టండి' అని మోదీ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ తర్వాత చాలామంది దినసరి కూలీలు పనులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. వారిని ఆదుకోవాల్సిందిగా మోదీ పిలుపునిచ్చారు.

ఎందుకీ క్యాంపెయిన్..
కరోనాపై పోరులో భాగంగా దేశం మొత్తం ఐక్యంగా ఉందని చాటి చెప్పేందుకు ప్రధాని మోదీ మొదట మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపు మేరకు ఆరోజు సాయంత్రం 5గంటలకు ప్రతీ ఒక్కరూ తమ బాల్కనీల్లో చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు ప్రతీ ఒక్కరూ ఇళ్ల ముందు,బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ఇలా దేశాన్ని ఏకం చేసినందుకు కొంతమంది నెటిజెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ద్వారా మోదీకి ధన్యవాదాలు తెలిపే క్యాంపెయిన్ను సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. అయితే ప్రధాని మోదీ సున్నితంగా మందలించడంతో దానికి చెక్ పెట్టినట్టయింది.












Click it and Unblock the Notifications