కేసీఆర్కు లైన్ క్లియర్ - ఛలో ఢిల్లీ: జగన్తో లింకు..!!
న్యూఢిల్లీ: దేశంలో 2024 నాటి సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలు సమాయాత్తమౌతోన్నాయి. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టనుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టనున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3,500 కిలోమీటర్ల పాటు ఆయన కాలినడకన పర్యటించనున్నారు. 150 రోజుల పాటు 12 రాష్ట్రాల గుండా భారత్ జోడో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది కాంగ్రెస్.
మోదీకి ధీటు..
మరోవంక- ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును బలపరుస్తారనే వార్తలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ఆయన ఒక్కరేననే అభిప్రాయం ప్రతిపక్ష పార్టీల్లో ఉంది. మోదీ తరహాలోనే దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ కావడం కలిసొచ్చే అంశంగా భావిస్తోన్నారు.
ప్రధాని అభ్యర్థిగా ప్రచారం..
ఇదివరకు ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగిన నితీష్ కుమార్కు అక్కడి గుట్టుమట్లన్నీ తెలుసని- ఎన్డీఏకు ధీటుగా రాజకీయ వ్యూహాలను రూపొందించగలరనే చెబుతున్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు నితీష్ కుమార్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ జనతాదళ్ సహకారంతో బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనూ ఆయన దీనిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను నమస్కారంతో సమాధానం ఇచ్చారు.
స్పందించిన నితీష్..
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బిహార్ పర్యటనలోనూ ఆయన దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేసీఆర్తో కలిసి పాట్నాలో నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు- ఈ అంశాన్ని ప్రస్తావించగా ఆయన లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారే తప్ప సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడాయన స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నితీష్ కుమార్- విలేకరులతో మాట్లాడారు.
పోటీదారుడిని కాదు..
ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, తాను పోటీదారుడిని ఎంతమాత్రం కాదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రధాని కావాలనే కోరిక కూడా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరితో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. బిహార్లో అధికారంలో ఉన్న మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో వామపక్షాలకు కూడా భాగస్వామ్యం ఉందని, అందుకే ఆయనను కలిశానని చెప్పారు.
ఏకతాటిపైకి రావడం..
భిన్నాభిప్రాయాలు గల పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం అనేదే పెద్ద విషయమని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ అన్నీ కలిసి ఒకేమాటపై ఉండటమే ఇక్కడ కీలకమని పేర్కొన్నారు. ప్రధాని రేసు నుంచి నితీష్ కుమార్ దాదాపుగా తప్పుకొన్నట్టయింది. ఈ పరిణామం కేసీఆర్కు కలిసొచ్చేదిగా భావిస్తోన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాకపోతే- ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్ పేరు తెర మీదికి వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.