ఇంటికెళ్లి పాలు తాగి రా అన్నాడు: తొలి టెస్టుపై సచిన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు ఆరంగేట్రం అంత సులభమేమీ కాదు. 1989లో తన తొలి టెస్టు మ్యాచ్ పాకిస్తాన్పై ఆడాల్సి వచ్చినప్పుడు తాను ఎలాంటి భావనకు గురైందనే విషయాన్ని టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో రాశాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ బౌలింగును ఎదుర్కునే నిలబడగలనా అనేది భయమేసిందని ఆయన చెప్పాడు.
తొలి టెస్టు మ్యాచ్ తనకు పరీక్షగా, క్లిష్టంగా కనిపించిందని, తొలి టెస్టు మ్యాచులోనే వకార్, వసీంలను ఎదుర్కోవాల్సి రావడం అత్యంత క్లిష్టమేనని, తనపై తనకు సందేహాలు కలిగాయని, తాను అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్ చేయగలనా లేదా అనే అనుమానం వేసిందని ఆయన అన్నాడు.
తన టెస్టు మ్యాచ్ ప్రవేశం పాకిస్తాన్లో పాకిస్తాన్పై ఆడడమని, వారి బౌలింగ్ ఆటాక్ కొత్త ఆటగాడికి పరీక్ష అని, ఫాస్ట్ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఆకిబ్ జావేద్లను, పైగా లెగ్ స్పిన్నర్లు ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ ఖాదీర్లను ఎదుర్కోవడం పరీక్షేనని అన్నాడు.
తన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో వసీం అక్రమ్ ఓవరులోని మూడో బంతిని తాను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అది ప్రమాదకరమైన బౌన్సర్ అని, ఆ తర్వాత తప్పకుండా యార్కర్ వేస్తాడని ఊహించానని, దానికి మానసికంగా సిద్ధపడ్డానని చెప్పాడు.
అయితే, మరో బౌన్సర్ ఎదురైందని, దాన్ని వదిలేశానని, తాను భయంకరమైన యార్కర్ను ఊహిస్తుంటే ఐదు, ఆరు బంతులు కూడా బౌన్సర్లే వచ్చాయని, ఓవరు ముసిగిన తర్వాత వెల్కం టు టెస్ట్ క్రికెట్ అని తనకు తాను చెప్పుకున్నానని టెండూల్కర్ వివరించాడు.
ప్రత్యర్థి పాకిస్తాన్పై అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి ఎలా ఉంటుందనే విషయాన్ని సచిన్ టండూల్కర్ వివరించాడు. వకార్ తొలి బంతి షార్ట్ డెలివరీకి ఓ పరుగు తీశానని, నిజానికి బంతి గదమ వరకు ఎగురుతుందని తాను ఊహించానని, తాను సరిగా అంచనా వేయలేకపోయానని, బంతి తాను ఊహించిన దానికన్నా మూడు అంగుళాలు పైకి లేచిందని, అది తన హెల్మెట్కు తాకి ముక్కును తాకిందని వివరించాడు.
ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుండగానే మియాందాద్ చేసిన వ్యాఖ్య తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. తనను ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడానికి "అరే తుమ్ తో అభీ హాస్పిటల్ జానా పడేగా, తేరా నాక్ టూట్ గయా హై" (నువ్వు ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లాల్సిందే, నీ ముక్కు పగిలిపోయింది) అన్నాడని, తన అసౌకర్యానికి అజ్యం పోస్తూ "బచ్చే ఘర్ జా కే దూధ్ పీకే ఆ" (పిల్లాడా, ఇంటికి వెళ్లి పాలు తాగిరా) అని అన్నాడని సచిన్ టెండూల్కర్ రాశాడు.