మోడీతో ఇబ్బంది లేదా, అంతా అమిత్ షా వల్లే: మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు.
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు.
బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా తీరు మాత్రం దేశంలో నిరంకుశత్వ వాతావరణాన్ని తీసుకువస్తోందనీ అన్నారు.
దేశంలో ప్రతిఒక్కరూ భయపడుతున్నారని, అత్యంత నిరంకుశత్వం నడుస్తోందని, ఒక పార్టీ అధ్యక్షులు మంత్రులతో ఎలా సమావేశాలు నిర్వహిస్తారని, అసలు ప్రధాని మోడీయా, అమిత్ షానా? అని మమత ప్రశ్నించారు.
తాను మోడీని ఇష్టపడతాను గానీ అమిత్ షాను కాదన్నారు. తాను ప్రధానిని నిందించబోనని, ఆయన్ని నిందించాలని ప్రశ్నించారు. ఆయన పార్టీ ఆ విషయాలను చూసుకోవాలి అన్నారు.
అటల్ బిహారీ వాజపేయి ప్ధానిగా ఉన్నప్పుడు ఆయన అందరినీ సమానంగా చూసేవారన్నారు. వాజపేయి కూడా బిజెపి వ్యక్తి అని, కానీ ఆయన బ్యాలన్స్గా వెళ్లేవారన్నారు. ఆయన నేతృత్వంలో మేం పని చేశామని, కానీ ఎప్పుడూ ఇబ్బంది రాలేదన్నారు.
మరోవైపు, మోడీ నాయకత్వాన్ని మెచ్చుకున్నందుకు మమతకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అవినీతిని నిర్మూలించడానికి మోడీ సర్కారు గట్టిగా కృషి చేస్తోందన్నారు.