జేబులో రూ. 500, పాత జీపు ఉన్నాయి: కేజ్రీవాల్
వారణాసి: తన జేబులో రూ.500, తన వద్ద పాత జీపు మాత్రమే ఉన్నాయని, అంతకు మించి తన వద్ద ఏమీ లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారణాసి లోకసభ స్థానంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేయడానికి సిద్ధపడిన ఆయన బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు.
తన ట్రేడ్ మార్కు అయిన తెల్లటి టోపీ ధరించి, తల్లిదండ్రులూ పార్టీ ముఖ్య నాయకులు వెంట రాగా ఆయన వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. అవినీతిని తరిమికొట్టి రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తన సాదాసీదా వ్యవహారాన్ని వారణాసి ప్రజలకు చూపించారు.
నరేంద్ర మోడీ నామినేషన్ వేయడానికి హెలికాప్టర్లో వస్తారని, తనకు ఈ జీపు తప్ప మరోటి లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీని మీరు హెలికాప్టర్లోనే చూడాల్సి రావచ్చు, జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు.
నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలవి హెలికాప్టర్ ప్రజాస్వామ్యమని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్య ప్రకటనలపై మోడీ 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారని, రాహుల్ గాంధీ కూడా పెద్ద యెత్తున ఖర్చు చేస్తున్నారని అంటున్నారని, ప్రజలు ఎటువంటి ప్రజాస్వామ్యం కావాలో ఎంచుకోవాలని ఆయన అన్నారు.
తాను ఫకీర్నని, తన వద్ద డబ్బులు లేవని, ప్రజల డబ్బులతోనే తాను ప్రచారం సాగిస్తానని, ప్రజలు ఏది కావాలో ఎంచుకోవాలని ఆయన అన్నారు.