రాహుల్ - రాజమ్మ ఆత్మీయబంధం.. పుట్టుకతోనే వయనాడ్తో అనుబంధం..
వయనాడ్ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన బ్రిటన్ పౌరుడంటూ ఫిర్యాదులు రావడంతో వివరణ ఇవ్వాలంటూ హోం శాఖ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు సైతం ఈ అంశంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే రాహుల్ భారతీయుడు మాత్రమే కాదు.. ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనకు వయనాడ్తో అనుబంధం ఉందని చెబుతున్నారు రాజమ్మ. తాను పురుడు పోసిన బిడ్డ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి తమ నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఆనందంతో మురిసిపోతున్నారు ఆ నర్సమ్మ.

ఒడిలోకి తీసుకుని మురిసిపోయాం
కేరళ వయనాడ్కు చెందిన 72 ఏళ్ల రాజమ్మ వవాటిల్ గతంలో ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో పనిచేశారు. 48 ఏళ్ల క్రితం ప్రపంచంలోకి అడుగుపెట్టిన రాహుల్ను తొలిసారి తానే ఒడిలోకి తీసుకున్నానని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ రాహుల్ను కలిసే అవకాశమొస్తే 1970 జూన్ 19న జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు వివరిస్తానని అంటున్నారు.

రాహుల్ను చూడాలన్న ఆత్రం
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న సభ్యున్ని చూసేందుకు తామంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూశామని ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటున్నారు రాజమ్మ. సోనియాకు సాధారణ ప్రసవం అయిందని, ముద్దుగా ఉన్న రాహుల్ను ఎత్తుకుని తామంతా మురిసిపోయామని చెబుతున్నారు. రాహుల్ పుట్టిన మూడు రోజులకు ఇందిరా హాస్పిటల్కు వచ్చారని, అయితే అతన్ని చిన్న పిల్లల వార్డులో చేర్చడంతో చూసేందుకు అనుమతించలేదని గుర్తు చేసుకున్నారు.

రాహుల్ను ప్రధానిగా చూడాలని కోరిక
రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం భర్తతో కలిసి వయనాడ్లో నివసిస్తున్న రాజమ్మ.. అవకాశమొస్తే రాహుల్ను కచ్చితంగా కలుస్తానని అంటున్నారు. వయనాడ్ ఎంపీ బరిలో దిగిన ఆయన గెలుపు తథ్యమని ధీమాగా చెబుతున్నారు. రాహుల్ని ప్రధానిగా చూడటమే తన కోరిక అని చెప్పారు రాజమ్మ.












Click it and Unblock the Notifications