నేనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు, తెలుసు: మోడీ
బెంగళూరు: తాను ఆకాశం నుంచి ఊడిపడిన నాయకుడిని కానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రైతులు, గ్రామీణ ప్రజల మధ్య జీవితాన్ని గడిపి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ రోజు ఐదు ఎకరాలు ఉన్న రైతులు బంట్రోతు ఉద్యోగానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉన్న దాంట్లో కాస్టా అమ్మి అయినా పిల్లలకు బంట్రోతు ఉద్యోగం ఇప్పించుకునే ప్రయత్నం చేసే దౌర్బాగ్యమైన పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
సరైన విద్య, పరిజ్ఞానం లేకపోవడం వలనే వ్యవసాయం క్షీణదశకు చేరుకుందన్నారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్లనే ఇష్టం వచ్చినట్టుగా రసాయన ఎరువుల వాడటంతో భూములు సారవంతాన్ని కోల్పోయాయన్నారు. రైతులను బలహీనపరిచే కార్యక్రమాలను తాము ఎప్పటికీ చేయబోమని అన్నారు. రైతులను, వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇన్నాళ్లుగా రైతుల కోసం పట్టించుకోని నాయకులు నేడు రైతుల కోసం ఉద్యమం చేస్తామని గొప్పలు పోతున్నారన్నారు. రైతులకు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో ఆదాయం రావాలని, పాడిపరిశ్రమ, పక్షుల పెంపకం వంటివి ఇతర పరిశ్రమలు ఉన్నపుడే రైతు బలపడే అవకాశముంటుందని అభిప్రయపడ్డారు.
తన పాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి పాలనకు స్వస్తి చెప్పామని, నల్లధనం వెలికితీతకు చర్యలు చేపట్టామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. బొగ్గు క్షేత్రాల వేలాన్ని ఎవరూ తప్పు పట్టలేకపోయారని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకు కేంద్ర సహకారం ఉంటుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు.
భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు రైతుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్సించారు. కేవలం రాజకీయాల కోసమే ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.
మువ్వన్నెల జెండాకు మోడీ భాష్యం
భారత జాతీయ జెండాకు మోడీ కొత్త భాష్యం చెప్పారు. కాషాయం విద్యుచ్ఛక్తికి ప్రతీక అని, తెలుపు క్షీరవిప్లవానికి సంకేతమని, ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి సూచన అని ఆయన వివరించారు. నీలం రంగు సముద్రశక్తిని, అందులోని గ్యాస్, పెట్రోలియం నిల్వలను తెలుపుతుందని అన్నారు. భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని అన్నారు.