కన్నీరు కార్చేందుకు రాలేదు: రాహుల్కు మోడీ పంచ్
ఝాన్సీ: తన నానమ్మను, తండ్రిని హత్య చేశారని, తననూ చంపేస్తారోమేనన్న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ శుక్రవారం స్పందించారు. మోడీ ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఇక్కడకు వచ్చింది కన్నీరు కార్చడానికి కాదని మీ కన్నీరు తుడవడానికే అన్నారు.బుందేల్ఖండ్ వెనుకబడటానికి యూపిఏనే బాధ్యత వహించాలన్నారు. ఈ ప్రాంతానికి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు ప్రజల కోసం కాదని నాయకుల కోసమేనని విమర్శించారు.
రాష్ట్రం నుండి సమాజ్వాది, బహుజన్ సమాజ్, కాంగ్రెసు పార్టీలను పారద్రోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మూడు పార్టీలు ఉత్తర ప్రదేశ్ను లూటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపికి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలోని అఖిలేష్ కుమార్ యాదవ్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోయిందన్నారు. అరవయ్యేళ్లుగా కాంగ్రెసు పాలిస్తోందని అయినా అభివృద్ధి లేదని తమకు అరవై నెలలు అధికారం ఇస్తే చేసి చూపిస్తామన్నారు.