ఎన్నో అనుభూతులు: సునందపై థరూర్, పోలీసులపై...
న్యూఢిల్లీ: తాను సునంద పుష్కర్ను చాలా మిస్ అవుతున్నానని, తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చి ఆమె వెళ్లిపోయిందని కేంద్రమంత్రి శశి థరూర్ ఆదివారం అన్నారు. ఓ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడారు. అదే సమయంలో పోలీసుల దర్యాఫ్తును ఆయన తప్పు పట్టారు.
సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తు వేగవంతంగా లేదని శశి థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య సంబంధితం కారణాలతోనే మృతి చెందినట్లుగా స్పష్టమవుతోందని చెప్పారు.
కేసును పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవని ఆయన అన్నారు. సునంద మృతి చెంది అయిదు వారాలు అవుతున్నా అర్థం పర్థం లేని ఊహలతో కేసును సాగదిస్తూ ముగించడం లేదన్నారు. తనపై వ్యక్తిగతంగా కేసు ఏమీ లేకున్నా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని తెలిపారు.
ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పోలీసులు ఎఫ్ఐఆర్, అభియోగ పత్రం నమోదు చేయలేదని, కేసును ఇంకా పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు.
ఈ విషయంలో సునంద తనయుడు, తండ్రి, సోదరుడు అందరు తనకు అండగా ఉన్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి కుట్ర కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. తాను ఆమెను ప్రతి క్షణం మిస్ అయ్యానని, తనకు ఆమె ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు.