ఆశలు పెట్టుకోకండి, మరో 20 ఏళ్లు నేనే పార్టీ అధ్యక్షురాలు: మాయావతి, పొత్తులపై మెలిక
లక్నో: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, బహుజన సమాజ్వాది పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ సహా వివిధ రాష్ట్రాలలో ఇతర పక్షాలతో పొత్తుల కోసం సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఎన్నికల్లో ఒంటరి పోరుకూ సిద్ధంగా ఉండాలని ఆమె కార్యకర్తలకు సూచించారు.
పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఇరవై ఏళ్ల వరకూ పార్టీని తానే నడిపిస్తానని, పార్టీలోని నాయకులు ఎవరు కూడా అధ్యక్ష పదవి కోసం కలలు కనవద్దని చెప్పారు. ముసలితనం వచ్చే వరకు తానే పార్టీ బాధ్యతలు చేపడతానన్నారు.
బీఎస్పీలో కుటుంబ పెత్తనం లేదని అభిప్రాయపడ్డారు. తన సోదరుడు పార్టీ కోసం సాధారణ కార్యకర్తలా పని చేస్తున్నారన్నారు. బీజేపీని అధికారం నుంచి పంపించాల్సి ఉందన్నారు. కాగా, తమకు కావాల్సిన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని మాయావతి చెప్పడం యూపీలో అఖిలేష్ యాదవ్కు షాక్ అని చెప్పవచ్చు.