కోవిడ్-19 ఆస్పత్రి.. ఇంత భయానక పరిస్థితులా... మరో 2 రోజులు ఉంటే చనిపోయేవాడిని...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కోవిడ్-19 ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుండటం... అక్కడ పేషెంట్లకు సరైన సదుపాయాలు,చికిత్స అందడం లేదన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్(LNJP) కోవిడ్-19 ఆస్పత్రిలో ఓ పేషెంట్కు ఎదురైన భయానక పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఎటుచూసినా మృతదేహాలు,కుప్పలు తెప్పలుగా పేషెంట్లు,సరైన ఫుడ్,ట్రీట్మెంట్ అందలేదని... మరో రెండు రోజులు అక్కడే ఉంటే తాను చనిపోయేవాడినని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
వైద్య, ఆరోగ్య మంత్రికి కరోనా లక్షణాలు: హైఫీవర్, అమిత్షా భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే
ఎల్ఎన్జేపీలో చేరిన రిటైర్డ్ ఉద్యోగి
ఢిల్లీకి చెందిన ఎడీఎంసీ రిటైర్డ్ ఉద్యోగి సురీందర్ కుమార్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇందుకోసం ఆయన ప్రతీ వారం డయాలసిస్ చేయించుకుంటారు. ఈ క్రమంలో జూన్ 8న ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్దారణ అయింది. డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లిన సమయంలోనే తనకు వైరస్ సోకి ఉండవచ్చునని ఆయన అనుమానిస్తున్నారు. ఏదేమైనా వైరస్ సోకిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యులు ఆయన్ను ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఆ తర్వాతే అసలు నరకం మొదలైందని ఆయన వాపోతున్నారు.
ఆ తర్వాత నుంచి ఏ సమాచారం లేదు..
'ఎమర్జెన్సీ వార్డులో నాన్నను చేర్పించాక.. ఒక వార్డు బాయ్ వచ్చి ముక్కుకు పెట్టాల్సిన ఆక్సిజన్ను తలకు పెట్టాడు. ఇదేంటని అడిగినందుకు మమ్మల్ని బయటకు నెట్టేశాడు.కనీసం మా నాన్న ఫోన్,బ్యాగ్,ఫుడ్ కూడా ఇవ్వనివ్వలేదు.' అని సురీందర్ కుమార్ తనయుడు సందీప్ లాలా వాపోయారు. ఆ తర్వాత 24గంటలు సురీందర్ కుమార్ను కలిసేందుకు ఆయన కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆయన ఏ వార్డులో ఉన్నారన్న సమాచారం తెలియరాలేదు. ఆస్పత్రి సిబ్బందిని అడిగితే.. హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయమన్నారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఆఖరికి స్వీపర్ ద్వారా ప్రయత్నించినా..
మూడో రోజు ఆస్పత్రిలో పనిచేసే ఓ స్వీపర్కు సందీప్ కొంత డబ్బును లంచంగా ఇచ్చి.. ఆమె ద్వారా తన తండ్రికి సెల్ ఫోన్ను పంపించాడు. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఆ నంబర్కు కాల్ చేసినా మా నాన్న లిఫ్ట్ చేయలేదు. హెల్ప్ లైన్కి కాల్ చేస్తే మా నాన్న సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. కానీ ఆ రాత్రంతా నేను సందీప్ తన తండ్రి నంబర్కు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇక జూన్ 11న ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు సురీందర్ కుటుంబం హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేస్తూనే ఉంది. ఎట్టకేలకు స్పందించిన అక్కడి సిబ్బంది... సురీందర్ ఆస్పత్రి నుంచి పారిపోయారని చెప్పడంతో ఆయన కుటుంబం షాక్ తిన్నది.
ఆస్పత్రి నుంచి పారిపోయాడని...
'మా నాన్న ఆస్పత్రి నుంచి పారిపోయాడని చెప్పగానే మేము షాక్ తిన్నాం. 60 ఏళ్ల వ్యక్తి,అది కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి.. ఆస్పత్రి నుంచి ఎలా పారిపోగలడు. ఆయన మిస్సింగ్పై ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు చెప్పారు.' అని సందీప్ తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది చెబుతున్న విషయాలు తమకు నమ్మశక్యంగా అనిపించలేదన్నారు. చివరకు ఇక తాను,తన సోదరుడు కలిసి ఎల్ఎన్జేపీ కోవిడ్ 19 వార్డులోకి వెళ్లినట్టు తెలిపారు. ఎక్కడ చూసినా వాడి పడేసిన పీపీఈ కిట్లు ఫ్లోర్పై పడేసి ఉన్నాయన్నారు. వార్డు,వార్డుకు తిరిగి వెతగ్గా.. చివరకు ఓ వార్డులో ఎట్టకేలకు తమ తండ్రిని గుర్తించామన్నారు.
ఎట్టకేలకు ఇలా..
చివరకు ఆస్పత్రి యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదం తర్వాత ఎట్టకేలకు సురీందర్ కుమార్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అనంతరం సురీందర్ కుమార్ మాట్లాడుతూ.. 'ఎల్ఎన్జేపీలో చేరాక నా ఆరోగ్యం మరింత దిగజారింది. అక్కడ సరైన వసతులు లేవు,చికిత్స అందించడం లేదు. తినడానికి కేవలం రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. మరో రెండు రోజులు అక్కడే ఉండి ఉంటే నేను చనిపోయేవాడిని. ఎటు చూసినా అక్కడ మృతదేహాలే పరుచుకుని ఉన్నాయి.' అని సందీప్ స్పష్టం చేశారు. సోమవారం ఓఖ్లా అనే ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం.
Recommended Video
మరో మహిళకూ ఇదే అనుభవం..
ఇటీవల మీరా దేవి అనే మహిళ కూడా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో ఇలాంటి భయానక పరిస్థితులనే ఎదుర్కొని మృతి చెందింది. ఆస్పత్రిలో చేర్చాక తన తల్లిని ఏ వార్డులో చేర్చారో తెలియక మీరా దేవీ కుమారుడు తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత ఆమెతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గరి నుంచి వార్డు బాయ్ వరకూ ప్రతీ ఒక్కరిని బతిమాలినా ఆమె సమాచారం తెలియలేదు. చివరకు ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు వార్డు నం.27లో ఉన్నట్టు చెప్పడంతో... ఎలాగోలా ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. అక్కడ తనకు తిండి పెట్టట్లేదని,సరైన వసతులు లేవని ఆమె వాపోయారు. దీంతో తన తల్లిని డిశ్చార్జి చేయాలని ఆస్పత్రి యాజమాన్యం కాళ్లా వేళ్లా పడ్డాడు. రెండు రోజుల తర్వాత వారు అందుకు ఒప్పుకున్నప్పటికీ.. అప్పటికే ఆలస్యమైంది. మీరా దేవి ఆస్పత్రిలోనే మృతి చెందారు. అయితే మీరా దేవీ కుమారుడిని కడసారి చూపుకు కూడా నోచుకోనివ్వకుండా పొరపాటున ఆమె మృతదేహాన్ని మరొకరికి అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు.